దేశంలో ఫస్ట్ టైం డిజిటల్ క్రెడిట్ కార్డు... రూ.2 లక్షల వరకు వెంటనే రుణం
హైదరాబాద్కు చెందిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ వివిఫై ఇండియా పైనాన్స్ దేశంలో మొదటిసారి యూపీఐ ప్లాట్ఫాంపై రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఫ్లెక్స్ పే పేరుతో యూపీఐ చెల్లింపుల ఆధారిత డిజిటల్ క్రెడిట్ కార్డును తీసుకు వచ్చింది. కస్టమర్ తమకు ఉన్న క్రెడిట్ లిమిట్ మేరకు ఫ్లెక్స్ పే యాప్ ద్వారా దుకాణాలలో యూపీఐ క్యూఆర్ కోడ్, యూపీఐ ఐడీని స్కాన్ చేసి చెల్లింపులు చేయవచ్చు. అవసరమైతే ఈ మొత్తాన్ని తన బ్యాంకు ఖాతాకు బదలీ చేసుకునే వెసులుబాటు ఉంది.
గుడ్న్యూస్, వాట్సాప్లో EPFO సేవలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నెంబర్లు ఇవే...
రూ.2 లక్షల వరకు రుణం ఎలా, వడ్డీ ఎంత
కస్టమర్ ఆదాయం, గతంలో తీసుకున్న రుణాలు, చెల్లింపు సామర్థ్యం, సిబిల్ స్కోర్, బ్యాంకు స్టేట్మెంట్ ఆధారంగా పదిహేను నిమిషాల్లో డిజిటల్ క్రెడిట్ కార్డు అందుబాటులోకి వస్తుంది. రూ.500 నుండి రూ.2 లక్షల వరకు క్రెడిట్ లిమిట్ పొందవచ్చు. డిజిటల్ క్రెడిట్ లాగా పని చేస్తుంది. క్రెడిట్ లిమిట్, వినియోగదారుడిని బట్టి వడ్డీ ఏడాదికి 36 శాతం వరకు ఉంటుంది. ఈ మొత్తాన్ని గరిష్టంగా 36 నెలల్లో చెల్లించాలి. ఉద్యోగులకు, వ్యాపారస్తులకు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఈ రుణ సదుపాయం ప్రయోజనం కలిగిస్తుంది. వ్యాలెట్, బ్యాంకు ఖాతాల్లో నగదు లేకపోయినప్పటికీ ఫ్లెక్స్పే ద్వారా ఉత్పత్తులు కొనుగోలు చేయవచ్చు. ప్రధానంగా క్రెడిట్ కార్డులు లేని వారిని లక్ష్యంగా చేసుకొని ఫ్లెక్స్ పేను తీసుకు వచ్చారు.
స్కాన్ అండ్ పే లాటర్
స్కాన్ అండ్ పే లాటర్ విధానంలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు వివిఫై వ్యవస్థాపకులు, సీఈవో అనిల్ పినపాల అన్నారు. దేశంలో ఈ తరహా రుణ సౌకర్యం ఇదే మొదటిసారి అన్నారు. బ్యాంకు అకౌంట్లలో, వర్చువల్ వ్యాలెట్లలో నగదు లేనివారికి ఇది ఉపయోగపడుతుందన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో వ్యాపారులు, ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇది దోహదపడుతుందన్నారు. 30,000 తమ కస్టమర్లకు ఇది డిజిటల్ క్రెడిట్ కార్డుగా ఉపయోగపడుతుందన్నారు. అలాగే క్రెడిట్ కార్డ్ సౌకర్యంలేని 30 కోట్ల మందికి ఇది ప్రయోజనకరమన్నారు. ఇప్పటికే ఉన్న 30వేల కస్టమర్ల ద్వారా ఈ రుణసౌకర్యాన్ని పరీక్షించామన్నారు. రాబోయే మూడేళ్లలో రూ.10వేలకోట్ల పంపిణీని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
రుణ చెల్లింపు ఇలా...
ఫ్లెక్స్ పే యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. పాన్, గుర్తింపు వివరాలు నమోదు చేయాలి.
కంపెనీ ఏజెంట్ వీడియో కాల్ ద్వారా కస్టమర్, పత్రాల ధృవీకరణ పూర్తి చేస్తారు. ఈ ప్రక్రియ పదిహేను నిమిషాల్లో పూర్తవుతుంది.
డేటా పాయింట్ల ఆధారంగా కస్టమర్ రుణానికి అర్హులా కాదా, అర్హులు అయితే ఎంత ఇవ్వవచ్చునో తెలుసుకుంటారు.
నగదును ఉపయోగించుకున్న కాలానికే వడ్డీ చెల్లించాలి.
వివిఫై 2017లో ప్రారంభమైంది. దీని ద్వారా 60,000 మంది కస్టమర్లకు రూ.220 కోట్ల రుణాలు అందించింది.