2008 కంటే దారుణం, ఐటీ రంగానికి అత్యంత క్లిష్టం: ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ
కరోనా మహమ్మారి ప్రభావం ప్రపంచ, భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే విమానయాన, పర్యాటక రంగాలు పడకేశాయి. ఈ వైరస్ ప్రభావం భారత ఐటీ పరిశ్రమపై కూడా ఉండనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో కరోనా ఐటీ రంగంపై ఫ్లాట్గా లేదా వ్యతిరేక ప్రభావం చూపే అవకాశముందని ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) వీ బాలకృష్ణన్ అన్నారు.
BigBasket గుడ్న్యూస్: కొద్ది రోజుల్లో 12,000 కొత్త ఉద్యోగాలు
నెగిటివ్ ప్రభావం లేదా ఫ్లాట్ ప్రభావం1
బాలకృష్ణన్ మాట్లాడుతూ.. ఐటీ రంగంపై నెగిటివ్ ప్రభావం లేదా ఫ్లాట్ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. 2008 కంటే పెద్ద సంక్షోభమేనని అభిప్రాయపడ్డారు. ఇండియన్ ఐటీ కంపెనీల కస్టమర్లు ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో ఈ ఏడాదిలో ఖర్చులు తగ్గించుకుంటారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం తీవ్రంగా ఉందని, వారు ఖర్చులు తగ్గించుకోవడంతో ఆ ప్రభావం మన ఐటీ సంస్థలపై పడుతుందన్నారు.
2008 కంటే దారుణం
2008 సంక్షోభం కంటే ఇప్పుడు దారుణ పరిస్థితులు ఉన్నాయని బాలకృష్ణన్ చెప్పారు. రోజురోజుకూ విజృంభిస్తున్న కరోనా కట్టడి కోసం దాదాపు అన్ని దేశాలు లాక్ డౌన్ వైపు చూస్తున్నాయి. అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనమే ఉంది. ఇప్పటికే ప్రపంచాన్ని మాంద్యం మబ్బులు కమ్మేశాయని IMF కూడా హెచ్చరించింది. బాలకృష్ణన్ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. 2008 కంటే దారుణంగా కనిపిస్తున్నాయన్నారు. నాటి మాంద్యం తర్వాత కూడా దేశీయ ఐటీ కంపెనీలు కొంత వృద్ధిరేటును కనబరిచాయని, త్వరగా కోలుకున్నాయని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదన్నారు.
ఇప్పటికే సిద్ధమైన పెట్టుబడులూ తగ్గించుకోవచ్చు
ఇందుకు ప్రధాన కారణం కరోనాకు ఔషధం ఇంకా లేకపోవడమే అన్నారు. ఈ వైరస్ను ఎప్పుడు, ఎలా అంతం చేస్తామో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. సింగపూర్ లాంటి దేశాల్లో లాక్ డౌన పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఈ క్రమంలో భారతీయ ఐటీ సంస్థల క్లయింట్స్ పెట్టుబడుల్ని భారీగా తగ్గించుకునే వీలుందని, ఇప్పటికే సిద్ధమైన పెట్టుబడులను కూడా వెనక్కి తీసుకోవచ్చునని చెప్పారు. ఈ పరిణామం దేశీయ ఐటీ రంగ ఆదాయంపై భారీగానే పడుతుందన్నారు.
ఈ ఏడాది క్లిష్టమే
ఐటీ ఇండస్ట్రీకి ఈ ఏడాది అత్యంత క్లిష్టమైనదేనని బాలకృష్ణన్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఐటీ కంపెనీల క్లయింట్స్ ఆధునిక సాంకేతికత కోసం వ్యయం పెంచకపోవచ్చునని తెలిపారు. ప్రస్తుత వ్యయాన్ని కొనసాగించడం లేదా అవసరమైతే తగ్గించడం చేయవచ్చునన్నారు.
ఇది సవాలే
భారత ఐటీ కంపెనీలు ఇప్పుడు తమ క్లయింట్లతో కలిసి పని చేయాలని బాలకృష్ణన్ సూచించారు. ఏ మేరకు వ్యాపారం అవుతుంది, ఖర్చును ఎలా అదుపులో ఉంచాలనే అంశాలపై ప్లాన్ చేసుకోవాలన్నారు. ఖర్చులో పరిమితి ఉండాలన్నారు. ప్రస్తుత ఏడాదిలో వద్ధి పాజిటివ్గా ఉంటే ఆశ్యర్యమే అన్నారు. దాదాపు మొదటి రెండు ఆర్థిక సంవత్సరాలే చాలా కీలకమని, ఇప్పుడు పరిస్థితులు పేలవంగా ఉన్నాయని, కాబట్టి ఈ ఏడాది ఐటీ సంస్థలకు సవాలే అన్నారు.
మార్జిన్లపై ఒత్తిడి
ఆయా రంగాల్లో ఐటీ వ్యయం తగ్గడంతో పాటు సాఫ్టువేర్ కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి పెరగనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే అంతర్జాతీయంగా రిటైల్, ఆర్థిక సేవల రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని అంటున్నారు. అమెరికాలో నిరుద్యోగిత రేటు పెరిగిందని, ఆర్థిక వ్యవస్థల పనితీరు పూర్తిగా పతనమైందని, ఈ నేపథ్యంలో వ్యవస్థలో కొనుగోలు శక్తి పూర్తిగా తగ్గిపోనుందని, మొత్తంగా ఐటీ రంగానికి గడ్డుకాలమే అంటున్నారు.