ఉద్యోగాల జోరు, టాప్ 5 ఐటీ కంపెనీల్లో 1.70 లక్షల నియామకాలు
కరోనా నేపథ్యంలో ఐటీ కంపెనీల్లో ఉద్యోగులకు డిమాండ్ పెరిగింది. అన్ని రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ ఐటీ రంగం పైన మిగతా వాటితో పోలిస్తే తక్కువ ప్రభావం పడింది. అంతేకాదు, కరోనా తగ్గిన తర్వాత డిజిటల్ నైపుణ్యత సహా వివిధ అంశాల నేపథ్యంలో ఐటీ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు పెరుగుతున్నాయి. దీంతో 2021 క్యాలెండర్ ఏడాదిలో టాప్ 5 ఐటీ కంపెనీలు లక్షలమంది ఉద్యోగులను తీసుకున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా టాప్ ఫైవ్ కంపెనీలు. ఈ కంపెనీలు జనవరి నుండి సెప్టెంబర్ మధ్య కాలంలో 1.7 లక్షల మంది ఉద్యోగులను చేర్చుకున్నాయి. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలోనే ఈ ఐదు కంపెనీలు 70,000 మందిని చేర్చుకున్నాయి. గత ఏడాది ఇదే కాలంలో 18,000 మందితో పోల్చుకుంటే దాదాపు నాలుగురెట్లు. కరోనా ముందు సంవత్సరం 2019 ఇదే త్రైమాసికంతో పోల్చినా దాదాపు రెండు రెట్లు. అప్పుడు 37,000 మందిని చేర్చుకున్నారు.
ఆట్రిషన్ రేటు ప్రభావం
2019 ఏడాదిలో జనవరి నుండి సెప్టెంబర్ మధ్య కాలంలో టాప్ 5 ఐటీ కంపెనీలు 77,000 కొత్త నియామకాలు చేపట్టగా, ఇప్పుడు 1.70 లక్షలకు పెరిగింది. ప్రస్తుతం ఐటీలో డిమాండ్ ఆల్ టైమ్ హైలో ఉంది. పరిశ్రమలో సరఫరా గొలుసు పరిమితి కీలక సవాల్గా మారింది. ఐటీ రంగంలో ఇటీవల ఆట్రిషన్ (వలస రేటు) భారీగా పెరిగింది. ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రాలో సెప్టెంబర్ త్రైమాసికంలో ఆట్రిషన్ రేటు ఏకంగా 20 శాతం కంటే ఎక్కువగా ఉంది. అధిక ఆట్రిషన్ రేటు మరో రెండు త్రైమాసికాలు ఉండవచ్చునని విప్రో చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సౌరబ్ గోవిల్ అన్నారు. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్ మంచి డిమాండ్లో ఉందని చెప్పారు. కేవలం పెద్ద ఐటీ కంపెనీ సంస్థలోనే కాదు, మిడ్-టైర్ ఐటీ కంపెనీల్లో కూడా ఆట్రిషన్ రేటు అధికంగా ఉంది.
గ్రేట్ రిజిగ్నేషన్
ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ సీఈవో సంజయ్ జాలోనా మాట్లాడుతూ.. ఇటీవల అమెరికాలో గ్రేట్ రిజిగ్నేషన్ అంశాన్ని గుర్తు చేశారు. అమెరికాలో గ్రేట్ రిజిస్ట్రేషన్ కారణంగా లక్షల జాబ్ ఓపెనింగ్స్ అక్కడ ఉన్నాయని చెప్పారు. నిరుద్యోగిత రేటు 7.5 శాతంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిభ లభ్యతలో లోటు భారీ ఆట్రిషన్కు కారణమవుతుందన్నారు. తమ కస్టమర్లు రెండంకెల ఆట్రిషన్ రేటును చూస్తున్నారని, వారు తమలాంటి భాగస్వాముల కోసం సెర్చ్ చేస్తున్నారన్నారు. లేబర్ కొరత కారణంగా అక్కడ చాలా వరకు ఆటోమేటిక్గా చేస్తున్నట్లు తెలిపారు. ఈ అంశాలు కలిపి మరిన్ని సాంకేతిక సేవలు, ఉద్యోగ అవసరాలను సృష్టిస్తున్నాయని చెప్పారు. ఎల్ అండ్ టీ 19.6 శాతం ఆట్రిషన్ రేటును నివేదించింది.
నియామకాల జోరు
ప్రస్తుతం నియామకాలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో టాప్ 5 ఐటీ కంపెనీలు 70,000 మందిని నియమించుకున్నాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 18,000 మందిని, అంతకుముందు (2019)లో 37,000 మందిని నియమించుకున్నాయి. టీసీఎస్ 78,000 మందిని నియమించుకుంటామని గతంలోనే ప్రకటించింది. ఇన్ఫోసిస్ 45,000 మందిని నియమించుకుంటామని తెలిపింది. విప్రో 17,000 మందిని నియమించుకుంటామని తెలిపింది.