భారత్కు కరోనా మహమ్మారి భారీ షాక్, 30 ఏళ్ల కనిష్టానికి వృద్ధి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 30 ఏళ్ల కనిష్టానికి చేరుకొని, 2 శాతానికే పరిమితం కావొచ్చునని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ తన తాజా అంచనాల్లో పేర్కొంది. కరోనా మహమ్మారి విస్తృతి ఫలితంగా ఎక్కువ రోజుల పాటు లాక్ డౌన్ విధించడం, ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడానికి కారణాలుగా తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 5.1 శాతం వృద్ధి రేటు ఉంటుందని గతంలో చెప్పిన ఫిచ్, ఇప్పుడు దీనిని 2 శాతానికి కుదించింది. 2021-2లో మాత్రం 7 శాతం నమోదు కావొచ్చునని తెలిపింది.
1946 కంటే వేగంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనం, కోట్ల ఉద్యోగాల కోత
వృద్ధి రేటు కుదింపు
చైనాలో తొలి దశలో తయారీ కార్యకలాపాల నిలిపివేతతో సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయని, ఈ ప్రభావాలు మరింతగా విస్తరించాయని ఫిచ్ పేర్కొంది. ఈ ఏడాది అంతర్జాతీయంగా మాంద్యం వస్తుందని అంచనాలు ఉన్నాయని, దీంతో ఈ ఆర్థిక సంవత్సరం భారత అంచనాలను రెండు శాతానికి కుదిస్తున్నట్లు తెలిపింది. మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ సంస్థ గత వారమే 2020లో భారత వృద్ధి రేటు అంచనాలను 5.3 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించింది. అలాగే ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ 3.5 శాతానికి, ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ 3.6 శాతానికి కుదించాయి.
ఎన్బీఎఫ్సీకి మరిన్ని సవాళ్లు
కస్టమర్లు ఖర్చులు తగ్గించుకోనుండటంతో లఘు, చిన్న, మధ్యతరహా సంస్థలు, సేవల రంగాలపై ఎక్కువగా ప్రతికూల ప్రభావం పడుతుందని ఫిచ్ పేర్కొంది. సాధారణంగా NBFC నుంచి రుణాలు తీసుకునే వారి ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగానే ఉంటుందని, వారి ఆదాయాలు తగ్గితే రుణాలు చెల్లించలేని పరిస్థితి తలెత్తుతాయని తెలిపింది. ఈ పరిస్థితుల్లో భారత్లోని NBFCలు మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది.
ఎన్బీఎఫ్సీలకు చిక్కులే
లాక్ డౌన్తో ప్రభుత్వం విధించిన ఆంక్షల కారణంగా కార్యకలాపాలు దెబ్బతినవచ్చునని, కరోనా కేసులు స్థానికంగా పెరిగితే ఆర్థికంగా సెంటిమెంటుపై కూడా దెబ్బతింటుందని, దీంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఎన్బీఎఫ్సీలు మళ్లీ పట్టాలు తప్పే అవకాశముందని ఫిచ్ పేర్కొంది. నిర్వహణ సామర్థ్యంతో పాటు ఆదాయాలు, లాభాలపై ప్రభావం తప్పదని పేర్కొంది.