అంచనాల కంటే మరింత దిగజారిన జీడీపీ ద్రవ్యలోటు
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారినట్టే కనిపిస్తోంది. మొన్నటికి మొన్న ద్రవ్యోల్బణ పరిస్థితులు మరింత పెరిగాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి ద్రవ్యోల్బణంలో పైపైకి దూసుకెళ్తూనే ఉంది. మార్చిలో నమోదైన రిటైల్ ద్రవ్యోల్బణంతో పోల్చుకుని చూస్తే.. ఏప్రిల్లో ఇది మరింత పైకి ఎగబాకింది. ఏప్రిల్లో వ్యవసాయం, గ్రామీణ కార్మిక రంగాల్లో ద్రవ్యోల్బణం 6.44, 6.67 శాతం మేర పెరిగింది. ఈ పెరుగుదల ఫలితంగా- కన్జ్యూమర్ ఇండెక్స్ నంబర్ను కూడా సవరించాల్సి వచ్చింది.
ఏ నెలకానెల పెరుగుతూ వస్తోన్న ద్రవ్యోల్బణం తీవ్రత మరింత పెరిగింది. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)పై పడింది. 2021-2022 ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో ద్రవ్యలోటు 6.7 శాతంగా నమోదైంది. ఇది- కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వేసిన అంచనాల కంటే తక్కువ. గత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 6.9 శాతంగా నమోదవుతుందని కేంద్రం తొలుత అంచనా వేసింది. ఈ విషయాన్ని- ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనాల్లోనూ సైతం పొందుపరిచింది.
అనంతరం దీన్ని పునఃసమీక్షించింది. పునఃసమీక్షించిన అంచనా (రివైజ్డ్ ఎస్టిమేషన్స్) ప్రకారం.. జీడీపీలో ద్రవ్యలోటు 6.9గా ఉంటుందని పేర్కొంది కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ. ఈ అంచనాలు కూడా తప్పాయి. జీడీపీలో ద్రవ్యలోటు 6.7 శాతంగా నమోదైంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ కొద్దిసేపటి కిందటే విడుదల చేసిన డేటాలో దీన్ని స్పష్టం చేసింది. అలాగే- 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ ఆదాయ-వ్యయాలకు సంబంధించిన వివరాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆవిష్కరించింది. ద్రవ్యలోటును ప్రొవిజినల్గా 15,86,537 కోట్ల రూపాయలుగా పేర్కొంది. రెవెన్యూ లోటు 4.37గా గుర్తించింది.
ఇదివరకు రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలకు మించి పెరిగిన విషయం తెలిసిందే. బియ్యం, జొన్నలు, సజ్జలు, రాగి, గోధుమ, కూరగాయలు, పండ్ల ధరలు భారీగా పెరగడం వల్ల రిటైల్ ద్రవ్యోల్బణానికి దారి తీసినట్లు అధికారులు వెల్లడించారు. వ్యవసాయ కార్మిక రంగంలో 19 రాష్ట్రాల్లో పెరుగుదల చోటు చేసుకుంది. ఇందులో 1 నుంచి 20 పాయింట్ల వరకు పెరుగుదల నమోదైంది. కేరళ గరిష్ఠంగా 20 పాయింట్లను రికార్డు చేసింది. గ్రామీణ కార్మిక కేటగిరీలో కేరళ, పశ్చిమ బెంగాల్ సంయుక్తంగా 19 పాయింట్లను అందుకున్నాయి.