కేంద్రం బాటలోనే ఆ రాష్ట్రాలు: ఏకంగా రూ.12 వరకు తగ్గిన పెట్రోల్, డీజిల్ ధర
కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్ పైన రూ.5, లీటర్ డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంతో ఇంధన ధరలు భారీగా తగ్గాయి. దీపావళి పండుగ రోజున వినియోగదారులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం శుభవార్తను అందించింది. పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దాటి వినియోగదారులకు షాకిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించి ఉపశమనం కల్పించింది. కేంద్ర ప్రభుత్వం తగ్గించిన ఎక్సైజ్ డ్యూటీ నేటి నుండి అమలులోకి వచ్చింది. మందగమనం, కరోనా వంటి కఠిన పరిస్థితుల్లో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగి, ఇక్కడ కూడా ధరలు ఆకాశాన్ని అంటాయి. ధరలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో గత మూడేళ్లలో మొదటిసారి కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. దీంతో చాలాచోట్ల డీజిల్ ధరలు రూ.100 దిగువకు వచ్చాయి. పెట్రోల్ ధరలు కూడా కాస్త తగ్గాయి.
ఆ రాష్ట్రాల్లో తగ్గింపు
మొన్నటి వరకు వరుసగా ఏడు రోజుల పాటు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు నిన్న స్థిరంగా ఉన్నాయి. నేడు కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంతో మరింత తగ్గాయి. మోడీ ప్రభుత్వం తాజా నిర్ణయంతో ధరలు తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు ప్రకటించిన కాసేపటికే తొమ్మిది బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా వ్యాట్ను తగ్గించాయి. దీంతో ఇతర రాష్ట్రాలపై ఒత్తిడి ఉంటుంది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన అసోం, గోవా, త్రిపుర, కర్నాటక, ఉత్తరాఖండ్, మణిపూర్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు వ్యాట్ను తగ్గించాయి.
కర్నాటకలో రూ.7 తగ్గింపు
కేంద్రం తగ్గింపుకు అదనంగా గోవా రాష్ట్రం పెట్రోల్ పైన రూ.7, డీజిల్ పైన రూ.7 వ్యాట్ తగ్గింపును ప్రకటించింది. దీంతో ఈ రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ పైన రూ.12, లీటర్ డీజిల్ పైన రూ.17 తగ్గుతుంది.
అసోం, కర్నాటకలు కూడా రూ.7 చొప్పున తగ్గించాయి. ఆ తర్వాత త్రిపుర, గుజరాత్ ముఖ్యమంత్రులు వ్యాట్ తగ్గింపు ప్రకటన చేశారు. ఉత్తర ప్రదేశ్ పెట్రోల్ పైన రూ.12, డీజిల్ పైన కూడా అంతేమొత్తం వ్యాట్ తగ్గింపును ప్రకటించింది. బీహార్లో పెట్రోల్ పైన రూ.1.30 పైసలు, డీజిల్ పైన రూ.1.90 పైసలు తగ్గింపు ప్రకటన వచ్చింది.
ఎక్సైజ్ సుంకం ఆదాయం
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన నేపథ్యంలో ప్రభుత్వానికి నెలకు రూ.8700 ఆదాయం తగ్గుతుంది. అంటే ఏడాదికి రూ.1 లక్ష కోట్ల మేర రెవెన్యూ పైన ప్రభావం పడుతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
పెట్రోల్, డీజిల్ పైన ఆయా సంవత్సరాల్లో ఎక్సైజ్ డ్యూటీ రాక ఇలా ఉంది. 2014-15లో రూ.99,068 కోట్లు, 2015-16 రూ.178,477 కోట్లు, 2016-17 రూ.242,691, 2017-18 రూ.229,716, 2018-19 రూ.214,369, 2019-20 రూ.223,057, 2020-21 రూ.372,970గా ఉంది.