చేతులు మారనున్న టాప్ పేమెంట్ గేట్ వే: 4.7 బిలియన్ డాలర్ల బిగ్ డీల్
బెంగళూరు: దేశీయ టాప్ పేమెంట్ గేట్ వే బిల్ డెస్క్.. చేతులు మారనుంది. విద్యుత్ బిల్లులు, ఆర్టీసీ బస్ టికెట్ల రిజర్వేషన్లు, లేదా ఇంకేదైనా ఆన్లైన్ చెల్లింపులను జరిపే సమయంలో మనకు కనిపించే పేరు బిల్ డెస్క్. దేశీయంగా టాప్ పేమెంట్ గేట్వేగా గుర్తింపు పొందింది. ఇప్పుడీ ఫైనాన్షియల్ కంపెనీ యాజమాన్యం మారబోతోంది. ఓ మల్టీ నేషనల్ కంపెనీ దీన్ని టేకోవర్ చేయనుంది. ఈ మేరకు ఈ రెండు ఫైనాన్షియల్ కంపెనీల మధ్య ఇన్నాళ్లూ పలు దఫాలుగా కొనసాగుతూ వచ్చిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి.
ఎంత మొత్తాన్ని చెల్లించి బిల్ డెస్క్ను టేకోవర్ చేయాలనే విషయం మీద కూడా ఈ రెండు కంపెనీల మధ్య ఓ అవగాహన కుదిరింది. ఇక త్వరలోనే మేనేజ్మెంట్ ట్రాన్స్ఫర్ ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న పే యు పరం కాబోతోంది బిల్ డెస్క్. పే యు బ్రాండ్ నేమ్తో ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టార్లో రాణిస్తోన్న ప్రొసుస్ వెంచర్స్.. బిల్ డెస్క్ను కొనుగోలు చేయనుంది. దీనికోసం 4.7 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేయనుంది.
ఈ కొనుగోలు ప్రక్రియ అనేది పూర్తయితే.. దేశీయంగా డిజిటల్ పేమెంట్స్ సెక్టార్లో చోటు చేసుకున్న అతి పెద్ద టేకోవర్ ఇదే అవుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. ఇప్పటిదాకా డిజిటల్ పేమెంట్స్ సెక్టార్లో ఇంత పెద్ద మొత్తంలో టేకోవర్ నమోదైన సందర్భాలు లేవు. పేటీఎం గానీ, ఫోన్పే గానీ, గూగుల్ పే.. ఇవన్నీ డిజిటల్ పేమెంట్స్ కిందికే వస్తాయి. ఆయా పేమెంట్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా వేటికవే పని చేస్తోన్నాయి.
బిల్ డెస్క్ కూడా వాటి పరిధిలోకే వస్తుంది. యాప్ రూపంలో బిల్ డెస్క్ అందుబాటులోకి రాలేదు. అయినప్పటికీ- లార్టెస్ట్ పేమెంట్ గేట్వేగా గుర్తింపు పొందింది. ఇందులో ఏకంగా 4.7 బిలియన్ డాలర్లతో పెట్టుబడులు పెట్టి.. టేకోవర్ చేయనుంది పేయు కంపెనీ మేనేజ్మెంట్. భారతీయ రిజర్వు బ్యాంక్.. డిజిటల్ పేమెంట్ రెగ్యులేటరీ వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేయడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. దీనికి సంబంధించిన నియమ, నిబంధనలు, గైడ్లైన్స్ త్వరలో వెలువడనున్నాయి.
ఈ పరిస్థితుల్లో బిల్ డెస్క్ చేతులు మారబోతోంది. ఈ ప్రాసెస్ పూర్తయిన తరువాత.. అంతర్జాతీయ స్థాయిలో అతిపెద్ద పేమెంట్ గేట్వేగా పే యు ఆవిర్భవిస్తుందని ప్రోసుస్ వెంచర్స్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బాబ్ వ్యాన్ డిజ్క్ తెలిపారు. భారత్ను తాము అతిపెద్ద మార్కెట్గా పరిగణిస్తోన్నామని పేర్కొన్నారు. ఇప్పటికే భారత్కు చెందిన టెక్ కంపెనీల్లో ఆరు బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టామని, దీన్ని 10 బిలియన్ డాలర్లకు విస్తరించాలనేది తమ లక్ష్యమని అన్నారు.