RBI: ఆర్బీఐ ఆ నిర్ణయం తీసుకుంటే కష్టమే.. ఆందోళనలో వ్యాపారులు.. వృద్ధి రేటు తగ్గించిన ఫిచ్..
RBI: ఆగస్టు రిటైల్ ద్రవ్యోల్బణం 7 శాతాన్ని చేరుకోవటంతో సర్వత్రా ఆందోళనలు నెలకొన్నాయి. భారత మార్కెట్లు పతనం కావటం ఇదే సూచిస్తోంది. అయితే ఈ క్రమంలో నెలాఖరున రిజర్వు బ్యాంక్ రెపో రేటు మళ్లీ పెంచవచ్చని ఆర్థిక నిపుణులు ఇప్పటికే అంచనా వేస్తున్నారు. వారి అంచనాలను తాజా నివేదికలు తోడయ్యాయి. ఈ సారి కూడా వడ్డీ రేట్ల పెంపు 50 బేసిస్ పాయింట్లు ఉంటుందని వారు భావిస్తున్నారు. ప్రస్తుతం రెపో రేటు 5.45 శాతం స్థాయిలో ఉంది.
ఏడాది చివరినాటికి..
ఆర్బీఐ ఇదే బాటలో పయనిస్తే ఈ ఏడాది చివరి నాటికి రెపో రేటు 6 శాతానికి చేరుకుంటుంది. ఫలితంగా బ్యాంకులు ఆర్బిఐ నుంచి.. సామాన్యులు, వ్యాపారులు బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకోవటం మరింత ఖరీదైనదిగా మారుతుంది. దీంతో ఆర్థిక అభివృద్ధి తీవ్రంగా ప్రభావితం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకుంటున్న స్థితిలో వడ్డీల భారం వ్యాపారాలకు కొత్త కష్టాలను తెచ్చిపెడుతుందని వారు అంటున్నారు.
ఆర్బీఐ జాగ్రత్తలు తీసుకోవాలి..
రెపో రేటు మరోసారి పెరగటం వల్ల రుణాలు ఖరీదైనవిగా మారతాయి. ఖరీదైన రుణాలు రికవరీ ప్రారంభ దశలో ఉన్న వ్యాపారాల పెట్టుబడిపై ప్రభావం చూపుతాయని బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్థికవేత్త జాన్వీ ప్రభాకర్ వెల్లడించారు. వడ్డీరేట్ల పెంపు వల్ల పరిశ్రమలకు రుణాలు ఆగిపోకుండా లేదా రుణాల లభ్యత తగ్గకుండా ఆర్బీఐ జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
ఆర్థిక వృద్ధి దెబ్బతినదు..
2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ 7 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని అంచనా వేయబడింది. అయితే స్థిరమైన, వేగవంతమైన రికవరీ కావాలంటే ప్రభుత్వం మూలధన వ్యయం (CAPEX)పై దృష్టి పెట్టాలని HDFC ఆర్థికవేత్త స్వాతి అరోరా పేర్కొన్నారు. ఆర్థిక పునరుద్ధరణలో ముందుకు సాగడానికి సరఫరా వైపు చెక్కుచెదరకుండా ఉంచడం చాలా అవసరమని వారు అంటున్నారు.
వృద్ధి రేటు తగ్గించిన ఫిచ్..
ఫిచ్ రేటింగ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాను మునుపటి అంచనా 7.8 శాతం నుంచి 7 శాతానికి తగ్గించింది. జూన్లో అంచనా వేసిన 7.8 శాతం వృద్ధితో పోలిస్తే.. 2022-23లో ఆర్థిక వ్యవస్థ 7 శాతం వృద్ధి చెందుతుందని, వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా అంతకుముందు అంచనా వేసిన 7.4 శాతం నుంచి జీడీపీ వృద్ధి 6.7 శాతానికి తగ్గుతుందని ఫిచ్ అంచనా వేస్తున్నట్లు తాజా నివేదికలో వెల్లడించింది.
సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి..?
రుణాలు కావాలనుకునేవారు పెరుగుతున్న రేట్లకు ప్రత్యామ్నాయాలను పరిగణలోకి తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం ECB, బాండ్ మార్కెట్ను ఆశ్రయించవచ్చని భావిస్తున్నారు. ధరలను స్థిరీకరించటానికి బియ్యం, గోధుమలు వంటి కీలక ఆహారపదార్థాల ఎగుమతిని ప్రభుత్వం ఇప్పటికే నిషేధించింది.
అయితే.. ఈ తరుణంలో భారతీయ రిజర్వు బ్యాంక్ వడ్డీ రేట్ల పెంపుపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. సామాన్యులు, చిన్న వ్యాపారులను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంది. ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకుంటే ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం చాలా వరకు ఉండబోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.