మరోసారి ఆర్థిక ప్యాకేజీ, లోన్ మారటోరియం కోసం విజ్ఞప్తులు
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తీవ్రంగా ప్రభావితమైన రంగాలకు భారీ ఉద్దీపనను ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. జీఎస్టీ కలెక్షన్స్ సహా కొన్ని ఆర్థిక సూచీలు ఇందుకు సంబంధించి కొన్ని ఆశావహ సంకేతాలు ఉన్నప్పటికీ త్వరలో రాబోయే గణాంకాలు వాస్తవ ఆర్థికస్థితిని మరింత వివరంగా వెల్లడిస్తాయి.
ఇకపోతే, ఉద్దీపనకు సంబంధించి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ఆర్థికవేత్తలతో చర్చించారని తెలుస్తోంది. అయితే, ఈ ప్రక్రియ ఇంకా ప్రాథమిక దశలో ఉందని, ప్యాకేజీపై మరింత స్పష్టత రావాలని చెబుతున్నారు. ఉద్దీపన ప్యాకేజీ ఇచ్చినప్పటికీ లాక్ డౌన్ ఆంక్షలను సడలించి, వ్యాపారాలపై విధించిన పరిమితులు తొలగించినప్పుడే ఫలితం ఇస్తుందనేది నిపుణుల అభిప్రాయం. ఈ విడత ఉద్దీపనలో ఏయే రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలనే అంశం నీతి అయోగ్ పరిశీలిస్తోంది.
ఆర్బీఐ ఇప్పటికే చిన్నస్థాయి రుణగ్రహీతలకు రుణ పునర్నిర్మాణ పథకం ప్రకటించింది. దీనికి తోడు రుణ చెల్లింపుల నిబంధనలు సడలించాలనే డిమాండ్ వినిపిస్తోంది. మళ్లీ లోన్ మారటోరియం ప్రకటించాలని పలు రంగాలు కోరుతున్నాయి. గత ఏడాది ఆర్బీఐ రుణాల తిరిగి చెల్లింపులకు ఆరు నెలల మారటోరియం కల్పించింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలోను ఈ వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు.