ఆ ప్యాకేజీ విలువ రూ.73,000 కోట్లు: ఏపీ-తెలంగాణలకు ఎంత వస్తుందంటే?
కరోనా కాలంలో మార్కెట్లకు డిమాండ్ సృష్టించేందుకు వచ్చే ఆరు నెలల కాలంలో రూ.1 లక్ష కోట్లను సమకూర్చనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఉద్యోగులకు సెలవులతో కూడిన ప్రయాణ రాయితీ (LTC) కింద నగదు ఓచర్లు, పండుగ అడ్వాన్స్తో ఇవ్వడంతో పాటు 50 ఏళ్ల దీర్ఘకాలానికి రాష్ట్రాలకు రుణ మంజూరు, కేంద్ర ప్రభుత్వం మూలధన వ్యయం పెంపు ద్వారా ఈ మొత్తాన్ని మార్కెట్లోకి తీసుకు రానున్నట్లు తెలిపారు. రూ.73వేల కోట్ల ప్రభుత్వపరమైన మద్దతును లేదా ప్యాకేజీని ప్రకటించింది. 6 నెలల్లో ఇంత భారీ మొత్తం ఖర్చు చేయడం వల్ల వ్యాపారాలు పుంజుకొని అదనపు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.
క్యాష్ వోచర్, రూ.10వేల అడ్వాన్స్: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం దీపావళి బంపర్ బొనాంజా
రూ.73వేల కోట్ల ప్యాకేజీలో దేనికెంత
LTC క్యాష్ వోచర్లు, శాలరీ అడ్వాన్స్ సహా మొత్తంగా రూ.73 వేల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు నిర్మల తెలిపారు. ఇందులో ఎల్టీసీ, శాలరీ అడ్వాన్స్ కోసం వరుసగా రూ.28,000, రూ.8,000 కోట్లు, ప్రయివేటు ఉద్యోగుల ఎల్టీసీ నగదు వోచర్లు రూ.28,000 కోట్లు, రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీలేని రుణం రూ.12వేల కోట్లు ఉన్నాయి. రూ.25,000 కోట్లను రోడ్లు, డిఫెన్స్, పట్టణాభివృద్ధి వంటి రంగాల్లో మౌలిక వసతుల కోసం కేంద్రం అదనంగా ఖర్చు చేయనుంది.
ఏపీ, తెలంగాణకు ఎంత రుణం వస్తుందంటే
రాష్ట్రాలకు ప్రకటించిన రూ.12 వేల కోట్ల రుణంలో రూ.1,600 కోట్లు ఈశాన్య రాష్ట్రాలకు, రూ.900 కోట్లు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు, రూ.7,500 కోట్లు ఇతర రాష్ట్రాలకు కేటాయించారు. 50 ఏళ్ల దీర్ఘకాలానికి రూ.12వేల కోట్ల వడ్డీరహిత మూలధన రుణాలను ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఈ వ్యవధిలో వడ్డీ, అసలు చెల్లించాల్సిన అవసరం లేదు. రుణాన్ని మూడు భాగాలుగా విభజించిన ప్రకారం హిమాలయ రాష్ట్రాలకు రూ.2500 కోట్లు ఉన్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కు రూ.308.32 కోట్లు, తెలంగాణకు రూ.159.975 కోట్లు వచ్చాయి.
ఆ షరతులను పూర్తి చేస్తే..
ఆత్మనిర్భర్ ప్యాకేజీ కింద కేంద్రం విధించిన నాలుగు షరతుల్లో మూడింటిని పూర్తి చేసిన రాష్ట్రాలకు మిగిలిన రూ.2వేల కోట్లను అందిస్తారు. ఇందులో ఏపీకి రూ.82.22 కోట్లు, తెలంగాణకు రూ.42.66 కోట్లు వస్తాయి. రూ.12వేల కోట్లను రాష్ట్రాలు మార్చి 31వ తేదీలోపు ఖర్చు చేయాలి.