Nirmala Sitharaman: బ్యాంకుల లాభాలపై నిర్మలమ్మ ట్వీట్.. రికార్డు లాభాలు తమవల్లేనంటూ కామెంట్..
Nirmala Sitharaman: వరుసగా వడ్డీ రేట్లను రిజర్వు బ్యాంక్ పెంచటం చాలా బ్యాంకులకు కలిసొచ్చింది. ప్రధానంగా నష్టాల్లో ఉన్న బ్యాంకులను గతంలో లాభదాయకమైన బ్యాంకుల్లో కలిపేయటం వల్ల వాటి లాభాలు సైతం పెరిగాయి. గతంలో కంటే అధిక ఆదాయం రెండవ త్రైమాసికంలో బ్యాంకులు నమోదు చేయటానికి ఇవి ప్రధాన కారణాలని బ్యాంకింగ్ నిపుణులు అంటున్నారు.
|
నిర్మలమ్మ ట్వీట్..
ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న 12 బ్యాంకులు రెండవ త్రైమాసికంలో రికార్డు లాభాలను నమోదు చేశాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు. తమ ప్రభుత్వ నిరంతర చర్యల వల్లే నిరర్థక ఆస్తులు తగ్గి బ్యాంకుల పనితీరు బలపడిందని చెప్పారు. ప్రస్తుతం వాటి త్రైమాసిక లాభం రూ.25,685 కోట్లకు చేరుకోవటం దీనికి నిదర్శనమని అన్నారు.
ప్రభుత్వ బ్యాంకుల లాభాలు..
ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండవ త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. ఎస్బిఐ తన అత్యధిక త్రైమాసిక లాభం రూ. 14,752 కోట్లను నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 74% అధికం. మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం గత ఏడాది కంటే 59 శాతం పెరిగి రూ.3,312 కోట్లుగా నమోదైంది.
ప్రైవేట్ బ్యాంకులు..
ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నెట్ ప్రాఫిట్ 20% పెరిగి రూ.10,605 కోట్లకు చేరుకుంది. ఇదే విధంగా ఐసీఐసీఐ బ్యాంక్ త్రైమాసికంలో 37 శాతం వృద్ధితో రూ.7,758 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. మరో ప్రైవేటు రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ 70 శాతం వృద్ధితో రూ.5,330 కోట్ల లాభాన్ని, కోటక్ మహీంద్రా బ్యాంక్ 27 శాతం వృద్ధితో రూ.2,581 కోట్ల లాభాన్ని నమోదు చేశాయి.