20 ఏళ్ళలో తొలిసారి రికార్డ్, నవంబర్లో రూ.46,251 కోట్ల FIIలు
ఫారన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్(FII) పెట్టుబడులు నవంబర్ నెలలో రికార్డ్ స్థాయిని తాకాయి. గత రెండు దశాబ్దాల్లో ఇది సరికొత్త రికార్డు కావడం గమనార్హం. కరోనా మహమ్మారి నేపథ్యంలో మార్చి చివరి వారం నుండి లాక్ డౌన్ ప్రకటించడంతో FIIలు తగ్గిపోయాయి. అయితే నవంబర్ నెలలో ఇరవై సంవత్సరాల్లోనే రానన్ని పెట్టుబడులు వెల్లువెత్తాయి. అమెరికా సహా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటం, ఇదే సమయంలో భారత్లో కేసులు తగ్గుముఖం పట్టి, రికవరీలు పెరగడంతో సానుకూలంగా మారుతోంది.
ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టి.. అదానీ రోజు సంపాదన రూ.449 కోట్లు: ప్రపంచ కుబేరుల్లో 40వ స్థానం
ఆ సమయంలో పెట్టుబడులు వెల్లువెత్తాయి
నవంబర్ నెలలో FII పెట్టుబడులు రికార్డ్ స్థాయిలో 46,251 కోట్లకు చేరుకున్నాయి. ఈ నెలలో ప్రతి ట్రేడింగ్లో పెద్ద మొత్తంలో షేర్లు కొనుగోలు చేశారు. కేవలం లక్ష్మీ పూజ రోజు మాత్రం రూ.78.5 కోట్ల షేర్లు విక్రయించాయి. అమెరికాలో ఎన్నికలు ముగిసిన తర్వాత డాలర్ సూచీ బలహీనత నేపథ్యంలో నిధుల ప్రవాహం పెరిగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసిన తర్వాత కొద్ది రోజుల పాటు అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి లేదా సస్పెన్స్ కనిపించింది. ఆ సమయంలో భారత మార్కెట్లోకి పెట్టుబడులు వెల్లువెత్తాయి. దీనికి తోడు భారత కంపెనీలు సెప్టెంబర్ త్రైమాసికంలో మంచి ఫలితాలతో రాణించాయి. ఇవి కూడా ఇండియన్ మార్కెట్ను FIIలు ఆకర్షించడానికి కారణమైంది.
రూ.1.34 లక్షల కోట్ల పెట్టుబడులు
ఈ ఆర్థిక సంవత్సరంలో (మార్చి నుండి) నికరంగా FIIలు రూ.1.34 లక్షల కోట్ల పెట్టుబడులు మన మార్కెట్లోకి వచ్చాయి. FIIల పెట్టుబడుల కారణంగా మార్చి 23వ తేదీ నాటి కనిష్టాల నుండి సూచీలు 70 శాతానికి పైగా లాభపడ్డాయి. మిడ్ క్యాప్ సూచీలు 73 శాతం, స్మాల్ క్యాప్ సూచీలు 83 శాతం రాణించాయి. ఐటీ, ఫార్మా, విద్యుత్, బ్యాంకింగ్, ఆర్థిక, మెటల్, ఎఫ్ఎంసీజీ షేర్లు బాగా రాణించాయి... రాణిస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ ఈ ర్యాలీ నుండి ప్రయోజనం పొందే ప్రయత్నం చేశాయి. నవంబర్ నెలలో ఇప్పటి వరకు DIIలు రూ.32,600 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. 6 నెలల్లో రూ.52,000 కోట్ల మేర విక్రయించారు.
FII రికార్డు రాకకు కారణాలు
అమెరికాలో ఎన్నికల తర్వాత డాలర్ బలహీనపడింది. భారతీయ కంపెనీలు సెప్టెంబర్ త్రైమాసికంలో మంచి ఫలితాలు ప్రకటించాయి. ఇతర దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండగా, మన దేశంలో తగ్గుతున్నాయి. అమెరికా ఉద్దీపన ప్యాకేజీ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ ఊహించిన దాని కంటే వేగంగా పుంజుకుంటోందని పలు అంతర్జాతీయ ఏజెన్సీలు చెబుతున్నాయి. ఇవన్నీ కలిసి వచ్చాయి.