హైదరాబాదుకు మరో బడా కంపెనీ ఫియట్ క్రిస్లర్: గ్లోబల్ డిజిటల్ హబ్ ఏర్పాటు-రూ.1100 కోట్లు పెట్టుబడులు
హైదరాబాదు: తెలంగాణలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. హైదరాబాదులో మరో గ్లోబల్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. హైదరాబాదులో ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ సంస్థ తమ గ్లోబల్ డిజిటల్ హబ్ను హైదరాబాదులో ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ సంస్థను హైదరాబాదుకు తీసుకురావడంలో ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది.
రూ.1100 కోట్లు పెట్టుబడులు
హైదరాబాదులో ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ రూ.1100 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. గ్లోబల్ డిజిటల్ హబ్ను ఇక్కడ ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో 1000 మందికి ఉద్యోగావకాశాలు ఉంటాయని సమాచారం. ఉత్తర అమెరికా, ఐరోపా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాల్లో ఉన్నదానికంటే హైదరాబాదులో ఏర్పాటు కానున్న ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ డిజిటల్ హబ్ అతి పెద్దదిగా అవతరించనుంది. ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ ధృవీకరించారు. హైదరాబాదులో వాణిజ్యంకు కావాల్సిన వాతావరణంను ప్రభుత్వం కల్పిస్తుందని మంత్రి కేటీఆర్ చెప్పారు.
మానుఫాక్చరింగ్ యూనిట్ కూడా..
ఈ మధ్యనే తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలను ప్రకటించడంతో ఈ రంగంలో సంస్థలు ఏర్పాటు చేసేందుకు కొన్ని బడా కంపెనీలు ముందుకొచ్చాయి. రాష్ట్రంలో పెరుగుతున్న ఆటోమొబైల్ అవసరాల దృష్ట్యా ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ మానుఫాక్షరింగ్ యూనిట్ ఏర్పాటుపై కూడా ఆలోచించాల్సిందిగా మంత్రి కేటీఆర్ కోరారు. హైదరాబాదు నగరం పెట్టుబడులకు స్వర్గధామం అని మంత్రి కేటీఆర్ వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధివిధానాలను తెలంగాణ ప్రభుత్వం రూపొందించిందని ఆయన వెల్లడించారు.
గ్లోబల్ డిజిటల్ హబ్లో 1000 ఉద్యోగాలు
ఇదిలా ఉంటే 2021 నాటికల్లా హైదరాబాదులో ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ సంస్థ 1000 ఉద్యోగాలను కల్పిస్తుందని సమాచారం. అదే సమయంలో రానున్న రెండు మూడేళ్లలో ఉద్యోగాల సంఖ్య పెంచుతామని కూడా స్పష్టం చేసింది. ప్రస్తుతం రిక్రూట్ చేసుకునేవారు ఉత్పత్తి, భవిష్యత్తులో తీసుకురావాల్సిన మార్పులపై పని చేస్తారని సంస్థ వెల్లడించింది. తెలంగాణలో తాము పెట్టుబడులు పెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ ప్రెసిడెంట్ మరియు ఎండీ డాక్టర్ పార్థ దత్త.భారత్లో భారతీయు అవసరతలకు తగ్గట్టుగా తమ ఆపరేషన్స్ ఉంటాయని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా యాక్సిలెరేటర్స్, క్లౌడ్ టెక్నాలజీలపై స్ట్రాటజీ ఇక్కడ రూపొందించడం జరుగుతుందని చెప్పారు.
హైదరాబాదులోనే ఎందుకంటే..
భారత్లో హైదరాబాదుకే ఈ సంస్థ రావడంపై కారణాలు చెప్పారు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ మమతా చామర్తి. తమ సంస్థ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించినందునే హైదరాబాదులో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చినట్లు మమత చామర్తి చెప్పారు. అంతేకాదు ఇక్కడ నైపుణ్యతకు కొదవ లేదని, వాణిజ్యంకు కావాల్సిన మంచి వాతావరణం ఇక్కడ ఉందని ఆమె చెప్పారు. దేశంలో డిజిటల్ హబ్ నెలకొల్పాలని ఏడాది క్రితం అనుకున్నట్లు చెప్పిన మమత... ఏడాదికంటే తక్కువ సమయంలోనే సంస్థను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించామని... ఆ సమయంలో మరో ఆలోచన లేకుండా హైదరాబాదు వైపు మొగ్గు చూపామని చెప్పారు. మమత చామర్తి హైదరాబాదులోనే పుట్టినట్లు చెప్పారు.
ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ సంస్థ ఇప్పటికే మహారాష్ట్ర, తమిళనాడులో ఉంది. అయితే దీని హెడ్క్వార్టర్స్ ముంబైలో ఉంది. మొత్తం 3వేల మంది ఈ సంస్థల్లో పనిచేస్తున్నారు. అయితే హైదరాబాదులో మాత్రం గ్లోబల్ డిజిటల్ హబ్ను ప్రారంభిస్తోంది. మహారాష్ట్ర, తమిళనాడుల్లో తయారయ్యే జీపులను జపాన్ ఆస్ట్రేలియా దేశాలతో సహా 13 దేశాలకు ఎగుమతి చేస్తోంది.