టీసీఎస్, ఇన్ఫీ, హెచ్సీఎల్, మైండ్ ట్రీ... ఐటీ ఉద్యోగులకు ముందే పండుగ వచ్చింది!
కరోనా మహమ్మారి నేపథ్యంలో వివిధ రంగాల్లో వేతనాల కోత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే సాఫ్టువేర్ రంగంలో మాత్రం కరోనా ప్రభావ పరిస్థితులు మిగతా రంగాల్లో ఉన్నంతగా లేదు. సెప్టెంబర్ త్రైమాసికంలో ఐటీ కంపెనీల ఆశాజనక, అంచనాలు మించిన ఫలితాల నేపథ్యంలో ఈ రంగంలోని స్టాక్స్ దుమ్మురేపుతున్నాయి.
వివిధ రంగాల్లో వేతనాలు పెంచేందుకు ఇబ్బందులు ఉండగా, దిగ్గజ ఐటీ కంపెనీలుమాత్రం తమ సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల సమయంలో వేతనాల పెంపు, ప్రమోషన్లను ప్రకటించాయి. దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్, మైండ్ ట్రీ, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ వేతనాల పెంపుతో పాటు ప్రమోషన్లు ఉంటాయని ప్రకటించాయి. దసరా, దీపావళి పండుగకు ముందే ఈ నాలుగు కంపెనీలు తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పాయి.
ప్రపంచ టాప్ ఐటీ కంపెనీగా.. యాక్సెంచర్ను వెనక్కి నెట్టిన TCS
TCSలో అందరికీ పెంపు!
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) అక్టోబర్ 1వ తేదీ నుండి ఉద్యోగులందరికీ వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించింది. టీసీఎస్లో సెప్టెంబర్ 30వ తేదీ నాటికి 453,540 మంది ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగులకు వేతనాల పెంపుతో పాటు ఫ్రెషర్స్ను తీసుకుంటామని కూడా ప్రకటించింది. అక్టోబర్ 1వ తేదీ నుండి పనితీరు ఆధారంగా వేతనాలు పెంచుతున్నట్లు వెల్లడించింది. కష్టకాలంలో అసాధారణస్థాయిలో పనిచేసిన ఉద్యోగులందరికీ ధన్యవాదాలు.. అక్టోబర్ 1వ తేదీ నుంచి వేతనాల పెంపును అమలు చేయబోతున్నామని సంస్థ గ్లోబల్ హెడ్ (మానవ వనరుల విభాగం) మిలింద్ లాకడ్ ఇటీవల ప్రకటించారు.
ఇన్ఫోసిస్ ఉద్యోగులకు శాలరీ హైక్.. వేరియేబుల్ పే
దేశీయ రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ కూడా తమ ఉద్యోగులకు వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి 1, 2021 నుండి వేతనాల పెంపును అమలు చేయడంతో పాటు 100 శాతం వేరియేబుల్ పే ఇస్తున్నట్లు తెలిపిందది. ఇన్ఫోసిస్లో 2.40 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగుల అద్భుతమైన పనితీరును గుర్తించి వంద శాతం వేరియేబుల్ పే ఇస్తున్నట్లు సీఈవో ప్రవీణ్ రావు తెలిపారు.
హెచ్సీఎల్ వేతన పెంపు ఎప్పటి నుండి అంటే
ఈ-3 లెవల్ వరకు ఉద్యోగులకు అక్టోబర్ 1 నుండి శాలరీ ఇంక్రిమెంట్ ఉంటుందని హెచ్సీఎల్ టెక్ ప్రకటించింది. ఈ-4 ఆ పైన ఉద్యోగులకు జనవరి 1 నుండి వేతన పెంపు అమలు చేయనుంది. వేతన పెంపు గతేడాది తరహాలో ఉంటుందని తెలిపింది. తమ ఉద్యోగులు అద్భుతమైన పనితీరును కనబరిచారని, క్లిష్ట పరిస్థితుల్లోను క్లయింట్స్కు మెరుగైన సేవలు అందించారని కంపెనీ తెలిపింది. కంపెనీలో 1,53,085 ఉద్యోగులు ఉన్నారు.
మైండ్ ట్రీ వేతనాల పెంపు
తాజాగా మరో ఐటీ కంపెనీ మైండ్ ట్రీ కూడా వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కంపెనీకి సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికం వరకు 21,827 మంది ఉద్యోగులు ఉన్నారు. సెప్టెంబర్లో ప్రమోషన్లు ఇచ్చామని, జనవరి 1వ తేదీ నుండి వేతనాలు పెంచుతున్నట్లు మైండ్ ట్రీ తెలిపింది. కొత్త ఉద్యోగులను కూడా అవసరం మేరకు నియమించుకుంటామని తెలిపింది.