ఆటో కంపెనీలకు దీపావళి వెలుగు: మెర్సిడెజ్ సహా భారీగా పెరిగిన కార్ల సేల్స్
ముంబై: నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న ఉద్దీపన చర్యలకు తోడు, ధన్తెరాస్-దీపావళి పండుగ సీజన్ కావడంతో ఆటోమొబైల్స్కు కొత్త ఉత్సాహం వచ్చిందట. గత ఏడాది కాలంగా ఆటో సేల్స్ భారీగా పడిపోయిన విషయం తెలిసిందే. ఇటీవలి వరకు సేల్స్ రోజురోజుకు దిగజారిపోయాయి. కానీ ఈ పండుగ సీజన్లో భారీ సేల్స్ జరిగాయి. నవరాత్రి, దసరా, ధన్తెరాస్, దీపావళి సందర్భంగా ఆటో సేల్స్ 5 నుంచి 7 శాతం పెరిగాయి. వాస్తవానికి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు సేల్స్ డబుల్ డిజిట్ కంటే తగ్గిపోయి, ఆ తర్వాత పుంజుకుంటాయి. మొత్తంగా ఆటో సేల్స్ ఇప్పుడు పెరిగినప్పటికీ ద్విచక్ర వాహనాల సేల్స్ మాత్రం ఆశించిన మేర పెరగలేదు.
ఈ పండుగ సీజన్లో దారుణంగా పడిపోయిన ఇన్నర్వేర్ సేల్స్
భారీగా పెరిగిన టాప్ 3 కంపెనీల కారు సేల్స్
టాప్ 2 కారు తయారీదారీ కంపెనీలైన మారుతీ సుజుకీ, హ్యుండాయ్ సేల్స్ నవరాత్రి, దసరా సమయంలో వరుసగా 7 శాతం, 10 శాతం పెరిగాయి. ధన్తెరాస్ సందర్భంగా అక్టోబర్ 25న గత ఏడాదితో పోలిస్తే డబుల్ డిజిట్ చేరుకున్నాయి. ఈ రెండు కారు మేకర్స్ మార్కెట్ 65 శాతం నుంచి 70 శాతం వరకు ఉంటుంది. మూడో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మహీంద్రా ధన్తెరాస్ రోజున యుటిలిటీ వెహికిల్స్లో 100 శాతం పెరుగుదలను నమోదు చేసింది.
లక్షా 45వేల కార్ల డెలివరీ
మారుతీ సుజుకీ నవరాత్రి, దసరా సీజన్లో 10 రోజుల్లో 60,000 కార్లు డెలివరీ చేసింది. హ్యుండాయ్ మోటార్ 25,000 కార్లును డెలివరీ చేసింది. ధన్తెరాస్ రోజున మారుతీ సుజుకీ 45,000 కార్లను, హ్యుండాయ్ 14,000 కార్లను డెలివరీ చేసింది. అంటే ఈ సమయంలో ఈ రెండు కార్ల కంపెనీలు మొత్తంగా లక్షా నలభై వేలకు పైగా కార్లను డెలివరీ చేశాయి. సేల్స్ పెరిగాయని కంపెనీకి చెందిన ప్రతినిధులు కూడా చెప్పారట.
సేల్స్ పెరిగాయి..
నవరాత్రి, దసరా సీజన్లో పది రోజుల పాటు సేల్స్ బాగున్నాయని, ధన్తెరాస్ రోజున కూడా అదే కొనసాగిందని మారుతీ సుజుకీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్తో చెప్పారు. మార్కెట్లో పాజిటివ్ సెంటిమెంట్ కనిపిస్తోందని, కానీ కొన్నాళ్లు చూసిన తర్వాతనే ఆటో సేల్స్ ఊపందుకున్నాయని చెప్పగలమన్నారు.
పండుగ సీజన్లో ఎక్కువ సేల్స్
దసరా, దీపావళి మధ్య నెల రోజుల వ్యవధిలో ఫోర్ వీలర్ సేల్స్ ఎక్కువగా ఉంటాయి. ఏడాదిలో సగటున లెక్కిస్తే ఈ నెల సగటు భారీగా ఉంటుంది. నార్త్, ఈస్ట్ ప్రాంతాల్లో ఎక్కువగా డిమాండ్ కనిపించిందని చెబుతున్నారు. టూవీలర్, పాసింజర్ కారు సేల్స్లో 50 శాతం నుంచి 55 శాతం వరకు ఇక్కడి నుంచే ఉన్నాయి. ఈ పండుగ సీజన్లో నెలవారీ అమ్మకాలు 3.5 నుంచి 4 రెట్ల వరకు ఎక్కువగా ఉంటాయి.
10 శాతం పెరిగిన సేల్స్
దసరా, నవరాత్రి పండుగ సమయంలో సేల్స్ 10 శాతం పెరిగాయని హ్యుండాయ్ మోటార్స్ ఇండియా నేషనల్ హెడ్ వికాస్ జైన్ చెప్పారు. ధన్తెరాస్ రోజు కూడా బాగానే ఉన్నాయన్నారు. గత ఏడాదితో పోలిస్తే ధన్తెరాస్ రోజున రిటైల్ 30 శాతం పెరిగిందన్నారు.
లగ్జరీ కార్లు కూడా అమ్ముడుపోయాయి
దసరా, నవరాత్రి సందర్భంగా లగ్జరీ కారు మార్కెట్ సేల్స్ కూడా పెరిగాయని చెబుతున్నారు. దసరా సమయంలో మెర్సిడెజ్ బెంజ్ 200 కార్లను (గుజరాత్, ముంబైలలో మాత్రమే) డెలివరీ చేసింది. దేశవ్యాప్తంగా ధన్తెరాస్ రోజున 600 కార్లు విక్రయించింది. SUV, GLE కార్లు అమ్ముడుపోయాయని చెబుతున్నారు. SUV, X7 కూడా అమ్ముడుపోయినట్లు BMW India తెలిపింది.
3000కు పైగా డెలివరీ చేసిన కియా, ఎంజీ మోటార్స్
కొత్తగా మార్కెట్లోకి వచ్చిన కియాతో పాటు ఎంజీ మోటార్స్ కూడా ధన్తెరాస్ సమయంలో 3,000కు పైగా డెలివరీస్ ఇచ్చాయి. మరోవైపు, టూవీలర్ హీరో మోటో కార్పు, బజాజ్ ఆటో.. కాస్త సానుకూల వ్యాపార ధోరణి కనిపిస్తోందని చెబుతున్నాయి. అయినప్పటికీ ఈ సమయంలో సేల్స్ ఆశించినంతగా లేవని అంటున్నారు.