Facebook: ఉద్యోగుల తొలగింపుకు ప్లాన్ రెడీ.. తరిగిపోతున్న కంపెనీ ఆదాయం.. మార్క్ మామ దారెటు..?
Facebook Layoff: అమెరికా టెక్ దిగ్గజం ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా తన ఉద్యోగుల సంఖ్యలో భారీగా కోత విధించాలని నిర్ణయించింది. అయితే ఈ సారి ఉద్యోగుల తొలగింపులు వేలల్లో ఉంటాయని తెలుస్తోంది. ట్విట్టర్ తొలగింపుల తర్వాత ఇది అతిపెద్ద సంచలనంగా మారిందని వాల్ స్ట్రీట్ జర్నల్ వార్తాపత్రిక పేర్కొంది.
రెండు దశాబ్దాల్లో..
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్బర్గ్ సెప్టెంబర్లో తొలగింపు ప్రణాళికను సిద్ధం చేశారు. అయితే ఈ బుధవారం నుంచి ఉద్యోగుల కోత మెుదలవుతుందని తెలుస్తోంది. కంపెనీ 18 ఏళ్ల చరిత్రలో ఇంత భారీగా సిబ్బందిని తొలగించటం ఇదే తొలిసారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మెటాకు ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ నాటికి 87,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆర్థిక మందగమనంతో పాటు కంపెనీ ఆదాయం భారీగా తగ్గటంతో ఖర్చులను తగ్గించాలని కంపెనీ నిర్ణయించింది.
మార్క్ ఏమంటున్నారంటే..
మెటా ప్రధాన ప్లాట్ఫారమ్లు ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వృద్ధి మందగించింది. అందువల్ల టీనేజ్లను తిరిగి ఆర్గనైజ్ చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే క్రమంలో 2023లో కంపెనీ పెట్టుబడులను తక్కువ సంఖ్యలో అధిక ప్రాధాన్యత రంగాలపై మాత్రమే పెట్టాలని నిర్ణయించింది. కంపెనీ మెటావర్స్ టెక్నాలజీపై
భారీగా పెట్టుబడులు పెట్టింది. కానీ దీని నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆదాయం రావటం లేదు. ఈ క్రమంలో కంపెనీ ఆర్థికంగా మెరుగైన స్థితికి చేరుకోవటానికి చర్యలు చేపడుతోంది.
క్యూ3 ఫలితాలు..
తాజాగా మెటా విడుదల చేసిన క్యూ3 త్రైమాసిక ఫలితాలు సైతం క్షీణతను నమోదు చేశాయి. ఇవి పెట్టుబడిదారులను నిరాశ పరుస్తున్నాయి. దీంతో ఇప్పటికే అమెరికా స్టాక్ మార్కెట్లలో మాంద్యం భయాల నేపథ్యంలో మెటా షేర్లు భారీగా పడిపోతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి కంపెనీ షేర్ల విలువ దాదాపు 73 శాతం పడిపోయింది. ఇది కంపెనీతో పాటు ఇతర స్టేక్ హోల్డర్లను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. అలా మార్క్ జూకర్ బర్గ్ బిలియన్-డాలర్ల మెటావర్స్ కలపై నీలి నీడలు అలుముకుంటున్నాయి. Meta ఆదాయం ఏడాదికి 4 శాతం క్షీణించి 27.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
తిరగబడిన ఇన్వెస్టర్లు..
కంపెనీ పనితీరుతో పెట్టుబడిదారులు అస్సలు సంతృప్తిగా లేరని తెలుస్తోంది. మెటావర్స్లో పెట్టుబడులు పెట్టడం మానేయాలని కంపెనీకి పిలుపునిచ్చారు. ఇదే క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీ ఉద్యోగులను 20 శాతం మేర తగ్గించాలని ఇన్వెస్టర్లు సూచించారు. ఈ క్రమంలోనే చాలా మంది తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారని తెలుస్తోంది. కంపెనీకి పూర్వ వైభం తీసుకురావాలని వారు కోరుతున్నారు.