దేవుడే వచ్చి చెప్పినా ఇన్ఫోసిస్ లెక్క అంతే: నందన్ నీలేకని
న్యూఢిల్లీ: టాప్ మేనేజ్మెంట్ అనైతిక విధానాలకు పాల్పడుతోందని గుర్తు తెలియని ఉద్యోగులు చేసిన ఆరోపణలపై ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని స్పందించారు. స్వయంగా దేవుడే దిగి వచ్చినా తాము తప్పుడు లెక్కలు రాయబోమని స్పష్టం చేశారు. కంపెనీ ప్రక్రియ అంత బలంగా ఉంటుందన్నారు. విజిల్ బ్లోయర్స్ చేసిన ఆరోపణలు అవమానకరమైనవన్నారు. అయితే ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని, దీనిపై తమ అభిప్రాయాలను రుద్దే ప్రసక్తి మాత్రం లేదన్నారు. ఈ మేరకు ఆయన ఇన్వెస్టర్లతో బుధవారం సమావేశమయ్యారు.
వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసే ప్రయత్నం
విజిల్ బ్లోయర్స్ ఫిర్యాదుల వెనుక సహవ్యవస్థాపకులు, కొందరు మాజీ ఉద్యోగుల హస్తం ఉందని ప్రచారం జరిగింది. ఈ ఊహాగానాలను కూడా నందన్ నీలేకని కొట్టి పారేశారు. ఇవి హేయమైన ఆరోపణలని, వ్యవస్థాపకుల వ్యక్తిగత ప్రతిష్టని దెబ్బతీసేందుకు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. భారీ ఆధాయాలు చూపేందుకు సీఈవో సలీల్ పరేఖ్, సీఎఫ్ఓ నీలాంజన్ రాయ్ అనైతిక విధానాలకు పాల్పడ్డారని ఫిర్యాదులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నందన్ నీలేకని వివరణ ప్రాధాన్యత సంతరించుకుంది.
మాకు గౌరవం ఉంది
అనవసర ప్రచారం హేయమైనవదని, అందరూ ఎంతగానో గౌరవించే వ్యక్తుల ప్రతిష్టను మసకబార్చే లక్ష్యంతో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, సంస్థకు జీవితాంతం సేవలు అందించిన మా సహవ్యవస్థాపకులు అంటే మాకు ఎంతో గౌరవమని, వారు కంపెనీ వృద్ధి కోసం నిస్వార్థంగా కృషి చేశారని, భవిష్యత్లో కూడా కంపెనీ శ్రేయస్సు కోసం పాటుపడేందుకు కట్టుబడి ఉన్నారని నందన్ నీలేకని చెప్పారు. టాప్ మేనేజ్మెంట్ మీద వచ్చిన ఆరోపణలపై ఇప్పటికే స్వతంత్ర న్యాయసేవల సంస్థ విచారణ జరుపుతోందని, నివేదిక వచ్చాక అందరికీ చెబుతామన్నారు.
టైమ్ లైన్ పెట్టట్లేదు
విచారణను సాధ్యమైనంత త్వరగా ముగించాలని కోరుకుంటున్నామని, అదే సమయంలో విచారణ సమర్థవంతంగా జరగాలని, అందుకే ఎలాంటి టైమ్ లైన్ పెట్టడం లేదని నందన్ నీలేకని చెప్పారు. ఆరోపణల విషయం కొలిక్కి వచ్చే వరకు కంపెనీకి చెందిన క్లయింట్లు పెట్టుబడులను నిలిపివేస్తారనే అంచనాలను ఆయన కొట్టి పారేశారు.
క్లయింట్ల అనుమానాలు నివృత్తి చేస్తాం
క్లయింట్లకు ఏవైనా ఆందోళనలు, అనుమానాలు ఉంటే మేం వెళ్లి అనుమానాలు తీరుస్తామని నందన్ నీలేకని చెప్పారు. తమపై వారికి ఉన్న విశ్వాసం అలాగే కొనసాగుతుందనన్నారు. ఎప్పటిలాగే వ్యాపారం నడిపేందుకు చేయవలసిందల్లా చేస్తున్నామన్నారు. వీటి మధ్య వ్యాపారంపై కూడా దృష్టి సారిస్తున్నామన్నారు.
మరిన్ని వివరాలు..
మరోవైపు, ప్రజావేగు ఫిర్యాదుపై పూర్తి సమాచారం ఇవ్వాలని నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (NFRA), రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్(ROC) కర్ణాటక విభాగం ఇన్ఫోసిస్ను కోరాయి. స్టాక్ ఎక్స్ఛేంజ్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఫిర్యాదులపై ఇన్ఫోసిస్ను మరింత సమాచారం కోరాయి. ఈ వివరాలన్నీ సమర్పించనున్నట్లు కంపెనీ తెలిపింది.