మా దేశానికి రండి: ఔషధ కంపెనీలకు బెల్జియం ఆఫర్
యూరోప్ ఖండంలోని బెల్జియం మన దేశానికి చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీలను సాదరంగా ఆహ్వానిస్తోంది. జనరిక్ ఔషధాల తయారీకి తమ దేశంలో మంచి అవకాశం ఉందని, యూరోపియన్ యూనియన్లో భాగంగా ఉండడం వల్ల బెల్జియంలో వాణిజ్య కార్యకలాపాలు సాగించడం ఎంతో సులభమని చెబుతోంది.
ఇటీవల హైదరాబాద్లో మన దేశానికి చెందిన ఫార్మా రంగ ప్రతినిధులతో సమావేశమైన బెల్జియం దేశ మంత్రి, యూరోప్ యూనియన్ మాజీ వర్తక కమిషనర్ అయిన కరెల్ డీ గుచ్ కూడా ఇదే విషయం వెల్లడించారు. ''మా దేశంలో పరిశ్రమలు స్థాపించండి, అక్కడ మంచి సదుపాయాలు ఉన్నాయి. పైగా పరిశోధన-అభివృద్ధి కార్యకలాపాలకు బెల్జియం పెట్టింది పేరు..'' అని ఆయన పేర్కొన్నారు.
భారత్-బెల్జియం దేశాల మధ్య...
భారత్ బెల్జియం దేశాల మధ్య 19 బిలియన్ డాలర్ల మేర ద్వైపాక్షిక వాణిజ్యం సాగుతోంది. ఈ మొత్తంలో 75-80 శాతం కేవలం వజ్రాల వ్యాపారమే. ఇంకా ఈ రెండు దేశాల మధ్యన యంత్ర సామగ్రి, ఐటీ, ఔషధాల వ్యాపారం కూడా జరుగుతోంది. మన దేశానికి చెందిన సాఫ్ట్వేర్ సేవల సంస్థలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్), విప్రో, సైయెంట్ లిమిటెడ్ ఇప్పటికే ఈ దిశగా బెల్జియం సంస్థలతో చర్చలు జరుపుతున్నాయి. హైదరాబాద్కు చెందిన ఐటీ సేవల సంస్థ సైయెంట్ లిమిటెడ్ గత ఏడాది ఏప్రిల్లో బెల్జియంలోని ఏన్సెమ్ సంస్థను 17 మిలియన్ డాలర్లు వెచ్చించి చేజిక్కించుకుంది. అలాగే డాక్టర్ రెడ్డీస్ సంస్థ కూడా బెల్జియంకు చెందిన యూసీబీ సంస్థతో కలిసి పనిచేస్తోంది.
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి రెడీ...
మన దేశంతో ఒక్క వజ్రాల వ్యాపారంలో మాత్రమే కాక, ఇతర రంగాల్లోనూ వాణిజ్యాన్ని పెంచుకోవాలని బెల్జియం భావిస్తోంది. దీనికోసం మన దేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ) కుదుర్చుకునేందుకు కూడా ఆ దేశం సిద్ధంగా ఉంది. ఈ విషయమై గతంలోనూ రెండు దేశాల మధ్య సంప్రదింపులు సాగాయి. అయితే తుది నిర్ణయానికి మాత్రం రాలేకపోయాయి. ఇప్పుడు మళ్లీ మన దేశంతో స్వేచ్ఛా వాణిజ్యానికి బెల్జియం ఆసక్తి చూపుతోంది. ఈ విషయంలో తదుపరి చర్యలకు తాము సిద్ధంగా ఉన్నామని బెల్జియం మంత్రి కరెల్ డీ గుచ్ కూడా చెప్పారు. ఇప్పటికే తమ దేశం కెనడా, జపాన్, వియత్నాం, కొరియా, సింగపూర్ వంటి దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసిందని, భారత్ ముందుకొస్తే.. ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
‘బ్రెగ్జిట్' వల్ల బెల్జియంకు నష్టమే...
‘బ్రెగ్జిట్' వల్ల యూకేకు నష్టమేనని, అదే సమయంలో బెల్జియం, నెదర్లాండ్స్ కూడా బాగా నష్టపోయే అవకాశం ఉందని, దీనికి కారణం ఈ మూడు దేశాలు దగ్గరగా ఉండడమేకాక.. వీటి మధ్య వర్తక సంబంధాలు కూడా అధికంగా ఉండడం అని బెల్జియం మంత్రి కరెల్ డీ గుచ్ పేర్కొన్నారు. వచ్చే జనవరి నాటికి యూరోప్ యూనియన్ నుంచి బ్రిటన్ సాంకేతికంగా బయటికి వెళ్లిపోయే అవకాశం ఉందని, ఒకవేళ అదేగనుక జరిగితే కొంతకాలం అనిశ్చితి రాజ్యమేలవచ్చని, అయితే బ్రిటన్ మనసులో ఏముందనేది అర్థం కావటం లేదని, ‘బ్రెగ్జిట్' జరిగితే కాని ఈ విషయం తేటతెల్లం కాదని ఆయన తెలిపారు.
చైనాతో వాణిజ్యం ఏకపక్షమే...
ఇక చైనాతో వాణిజ్యం ఎప్పుడూ ఏకపక్షంగానే ఉంటుందని, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఆ దేశానికి లేదని బెల్జియం మంత్రి కరెల్ డీ గుచ్ వ్యాఖ్యానించారు. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం కూడా సంప్రదింపులతో పరిష్కారం అయ్యేది కాదని, ఇది సంస్థాగతమైన విభేదాల ఫలితంగా తలెత్తిన వివాదమని ఆయన విశ్లేషించారు. యూరోప్ యూనియన్లోని దేశాలకు ఉన్న వాణిజ్య వివాదాల్లో 80 శాతం ఒక్క చైనాతోనే ఉన్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. రీజియన్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ (ఆర్సెప్)లో చేరేందుకు భారత్ వెనుకంజ వేయడానికి కూడా చైనాతో ఉన్న ఈ ఇబ్బందే కారణం అయి ఉండొచ్చని బెల్జియం మంత్రి కరెల్ డీ గుచ్ పేర్కొన్నారు.