రూ.38,000 కోట్లు నష్టపోయిన పేటీఎం ఇన్వెస్టర్లు, చైనా ఎఫెక్ట్ ఉందా?
దలాల్ స్ట్రీట్లో రూ.18,300 కోట్ల సమీకరణతో వచ్చిన అతిపెద్ద ఐపీవో పేటీఎం లిస్టింగ్ రోజు నీరుగారింది. స్టాక్ మార్కెట్లో పేటీఎం షేర్ ఇష్యూ ధరను రూ.2150గా నిర్ణయించగా, 9 శాతం క్షీణించి రూ.1950 వద్ద లిస్ట్ అయింది. అలాగే, ఇష్యూ ధరతో 27 శాతం మేర నష్టపోయి రూ.1560 వద్ద ముగిసింది. బలహీన లిస్టింగ్, స్టాక్ క్షీణత పైన విజయ్ శేఖర శర్మ స్పందించారు. నేటి కంపెనీ షేర్ ధర కంపెనీ నిజమైన వ్యాల్యూను ప్రతిబింబించదన్నారు. ఇది కేవలం ఆనాటి లేదా ఆ సమయంలో (మార్కెట్ కొనుగోలు, అమ్మకం సమయం) కొనుగోలుదారు, విక్రేత అభిప్రాయం మాత్రమే అన్నారు. ఏది ఏమైనా నిన్న స్టాక్ నిరాశజనకంగా ముగిసింది. దీంతో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు.
రూ.35,000 కోట్లు పతనం
పేటీఎం ఇన్వెస్టర్ల సంపద నిన్న ఒక్కరోజే రూ.38,000 కోట్లు పడిపోయింది. ఇష్యూ ధర సమయంలో పేటీఎం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.39 లక్షల కోట్లుగా నమోదయింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ 23 శాతం క్షీణించి (రూ.32,000 కోట్లు) రూ.1.07 లక్షల కోట్లకు పడిపోయింది. ఆ తర్వాత స్టాక్ మరింత క్షీణించడంతో రూ.38,000 కోట్లు క్షీణించింది. ఇటీవల జొమాటో లిస్టింగ్ సమయంలో రూ.1.22 లక్షల కోట్ల మార్కెట్ వ్యాల్యూ కలిగి ఉంది. దీని కంటే పేటీఎం తక్కువ. అయితే నైకా రూ.1.01 లక్షల కోట్లతో పోలిస్తే అధికం.
పేటీఎం..
కాగా, రిటైల్ ఇన్వెస్టర్లు ఒక్కో లాట్ పైన రూ.12,900 పెట్టుబడి పెడితే, సంస్థ రూ.3,500 నష్టాన్ని పేటీఎం చేసింది! సంస్థ మార్కెట్ విలువ రూ.38,000 కోట్ల మేర హరించుకుపోయినా, రూ.లక్ష కోట్ల పైన నిలిచింది. పేటీఎం పబ్లిక్ ఇష్యూలో ఒక లాట్కు 6 షేర్లను నిర్ణయించారు. ఇష్యూ ధర రూ.2150. పెట్టుబడి రూ.12,900. బీఎస్ఈలో లిస్టెడ్ రూ.1955 ప్రకారం ఈ పెట్టుబడి వ్యాల్యూ రూ.11,730కు తగ్గింది. ఇన్వెస్టర్కు రూ.1,170 నష్టం వచ్చింది. ముగింపు ధర ప్రకారం రూ.1564 పెట్టుబడి వ్యాల్యూ రూ.9384కు పరిమితమైంది. నష్టం రూ.3,516. అంటే పెట్టుబడిలో నాలుగో వంతు అవిరి అయింది.
అందుకే పేటీఎం క్రాష్?
పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మకు రూ.14,000 కోట్ల వ్యాల్యూ కలిగిన 14 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఇందులో చైనా అలీబాబా గ్రూప్కు 6 శాతం వాటా ఉంది. అసోసియేట్ యాంట్ ఫైనాన్షియల్, జపాన్ సాఫ్ట్ బ్యాంకు, వారెన్ బఫెట్ బెర్క్షైర్ హాత్వేకు కూడా వాటాలు ఉన్నాయి. అయితే, పేటీఎంలో గణనీయ స్థాయిలో చైనా సంస్థల పెట్టుబడులు ఉండటంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలపడలేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పేటీఎంలో చైనా సంస్థలకు 30 శాతానికి పైగా వాటా ఉంది. ఇప్పటికే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి లైసెన్స్ కోసం ఆర్బీఐకి పేటీఎం దరఖాస్తు చేసుకుంది. చైనా-భారత్ మధ్య సరిహద్దు వివాదాల నేపథ్యంలో పేటీఎంకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లైసెన్స్ లభించడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశీయ సంస్థల్లో చైనాపెట్టుబడి ప్రతిపాదనలపై కేంద్రం ఆచితూచి స్పందిస్తోంది.