కరోనా కేసులు.. పీఎఫ్ నుండి భారీగా ఉపసంహరణలు: 4 నెలల్లో రూ.30వేలకోట్లు
కరోనా మహమ్మారి నేపథ్యంలో చాలామంది ఉద్యోగులు ఈపీఎఫ్ఓ అకౌంట్ నుండి నగదును ఉపసంహరించుకుంటున్నారు. ఏప్రిల్ - జూలై మధ్య ఇప్పటి వరకు 8 మిలియన్ల మంది రూ.30,000 కోట్లు ఉపసంహరించుకున్నారు. 60 మిలియన్ల ఉద్యోగులు, వారి యజమానుల ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ రూ.10 లక్షల కోట్ల కార్పస్ను ఈపీఎఫ్ఓ నిర్వహిస్తోంది. ఈపీఎఫ్ఓలోకి ఎప్పుడు ఎక్కువగా నిధులు వస్తాయి. కానీ కరోనా కారణంగా ఈసారి పెద్ద మొత్తంలో ఉపసంహరణలు చోటు చేసుకున్నాయి. ఇది ఫండ్ ఆదాయాలపై ప్రభావం చూపే అవకాశముందని అధికారులు అంటున్నారు.
74 లక్షల షేర్లు విక్రయించిన ఆదిత్యపురి, HDFC షేర్లు ఢమాల్! బ్యాంకు ఏం చెప్పిందంటే..
కరోనా విండో కింద పెద్ద ఎత్తున ఉపసంహరణ
ఏప్రిల్ నుండి జూలై మూడో వారం వరకు సాధారణంగా ప్రతి ఏడాది జరిగే ఉపసంహరణల కంటే ఎక్కువగా జరిగినట్లు ఈపీఎఫ్ఓ అధికారులు చెబుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగాల కోత, వేతన కోత, మెడికల్ ఖర్చులకు ఇవి నిదర్శనమని అంటున్నారు. మొత్తం ఉపసంహరణలలో 3 మిలియన్లు (30 లక్షలు) లబ్ధిదారులు కరోనా విండో కింద రూ.8,000 కోట్లు ఉపసంహరించుకున్నారు. మిగిలిన రూ.22,000 కోట్లను 50 లక్షల ఈపీఎఫ్ఓ చందాదారులు సాధారణ ఉపసంహరణ కింద తీసుకున్నారు. ఇందులో ప్రధానంగా మెడికల్ అడ్వాన్స్లు ఉన్నాయి. ఈ మేరకు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి.
కేసులు పెరిగితే ఉపసంహరణలు పెరగవచ్చు
కరోనా మహమ్మారి వ్యాప్తిని నియంత్రించేందుకు మార్చి చివరి వారంలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ప్రజలకు వివిధ రకాల ప్రయోజనాలు కల్పించడంతో పాటు కోవిడ్ కింద ఈపీఎఫ్ ఉపసంహరణకు అవకాశం కల్పించింది. కరోనా కేసులు పెరుగుతున్నా కొద్దీ ఈపీఎఫ్ఈ ఉపసంహరణలు కూడా పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో 10 మిలియన్ల మంది తమ సేవింగ్స్ నుండి ఉపసంహరించుకునేలా ఉందని చెబుతున్నారు.
4 నెలల్లోనే..
ఈపీఎఫ్ఓ FY2020లో 15 మిలియన్ల సబ్స్క్రైబర్లకు రూ.72,000 కోట్లు ఇచ్చింది. కానీ ఇప్పుడు నాలుగు నెలల్లోనే ఏకంగా రూ.30,000 కోట్లు ఉపసంహరించుకున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 15 మిలియన్ల మందికి చెల్లిస్తే ఈసారి నాలుగు నెలల్లోనే 8 మిలియన్లు దాటింది. కరోనా నేపథ్యంలో ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్లు మొత్తంలో 75 శాతం లేదా మూడు నెలల వేతనం.. ఇందులో ఏది తక్కువ అయితే దానిని తీసుకునే వెసులుబాటు కల్పించింది.