6,50,000 కంపెనీలకు EPF శుభవార్త: ఆలస్యంగా చెల్లించినా జరిమానా లేదు
కరోనా మహమ్మారి - లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలు నిలిచిపోవడంతో కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. లాక్ డౌన్ సమయంలో ప్రావిడెంట్ ఫండ్ బకాయిలను జమ చేయడంలో ఆలస్యం జరిగితే జరిమానా విధించకూడదని నిర్ణయించింది. ఈ మేరకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) శుక్రవారం సంస్థలకు ఊరట కల్పించింది. అలాగే, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించినట్లుగా కంపెనీలు తక్కువ ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ ప్రయోజనం కూడా ఉంటుందని తెలిపింది.
భారీగా ఉద్యోగాల కోత, శాలరీ కోత: కానీ ఇది తాత్కాలికమే.. త్వరలో కొత్త నియామకాలు షురూ!
డిఫాల్ట్ కాదు.. జరిమానా లేదు
కరోనా-లాక్ డౌన్ కారణంగా కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈపీఎఫ్ బెనిఫిట్స్ కూడా ఇస్తోంది. లాక్ డౌన్ సమయంలో కంపెనీలు, సంస్థలు సకాలంలో పీఎఫ్ మొత్తాలను జమ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, కంపెనీల కార్యకలాపాలు కోసం.. ఆర్థిక కారణాల వల్ల దీనిని డిఫాల్ట్గా పరిగణించరాదని, అలాగే జరిమానా విధించరాదని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.
లిక్విడిటీ కొరత.. ప్రయోజనం
ప్రభుత్వం ప్రకటించిన సుదీర్ఘ లాక్ డౌన్ వల్ల సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయని, కార్యకలాపాలు లేకుండా పోయాయని, దీంతో సకాలంలో చెల్లింపులు జరపలేకపోతున్నాయని పేర్కొంది. ఈ ప్రయోజనంతో 6,50,000 కంపెనీలకు భారీ ఊరట కలుగుతుంది. అదే సమయంలో ప్రస్తుత క్లిష్ట పరిస్థుతుల్లో జరిమానా నుండి విముక్తి లభిస్తుంది. లిక్విడిటీ సమస్య ఎదుర్కొంటున్న కంపెనీలు.. వర్కర్స్ ఈఫీఎప్ కాంట్రిబ్యూషన్ ఆలస్యం చేసినా ఇబ్బందులు లేవు.
పీఎఫ్ తగ్గింపు ప్రయోజనం చెప్పాలి
కేంద్ర ఆర్థికమంత్రి కంపెనీలకు 24 శాతం నుండి 20 శాతం పీఎఫ్ కాంట్రిబ్యూషన్ ప్రయోజనం మే నెల నుండి వర్తించవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్మికులకు ఈపీఎఫ్ఓ సహకారం తగ్గించడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేయాలని ఈపీఎఫ్ఓ సీఈవో కంపెనీలకు సూచించారు. 12 శాతంలో 2 శాతం కాంట్రిబ్యూషన్ తగ్గించడం వల్ల ఆ మేరకు ఈఫీఎఫ్కు వెళ్లదని, ఆ మొత్తం కంపెనీల చేతుల్లో ఉంటుందని, మిగతా రెండు శాతం ప్రయోజనాన్ని కార్మికులకు అందించాలని సూచించారు.
రూ.8,000 కోట్ల ఉపసంహరణ
ఇదిలా ఉండగా, కరోనా కారణంగా ఈపీఎఫ్ఓ నుండి డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో 2.3 మిలియన్ల మంది ఉద్యోగులు 8,000 కోట్ల మొత్తాన్ని ఉపసంహరించుకున్నారు. ఉద్యోగులు సేవింగ్స్లో 75 శాతం లేదా గరిష్టంగా మూడు నెలల ప్రాథమిక వేతనం ఉపసంహరించుకోవచ్చు. ఇందులో ఏది తక్కువ అయితే దానిని ఉపసంహరించుకోవచ్చు.