వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటే ఉద్యోగానికి రాజీనామా!
కరోనా మహమ్మారి నేపథ్యంలో గత రెండేళ్లకు పైగా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగిస్తున్నాయి. అయితే ఇటీవల కరోనా ప్రభావం దాదాపు పూర్తిగా తగ్గడంతో ఉద్యోగులను కార్యాలయాలకు రప్పిస్తున్నాయి. అయితే కార్యాలయాలకు రావడానికి కొంతమంది ఉద్యోగులు ఆసక్తి చూపించడం లేదు. కార్యాలయానికి రమ్మంటే రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్నారు. నైపుణ్య ఉద్యోగులను వదులుకోవడానికి కంపెనీలు ఇష్టపడటం లేదు. కంపెనీలు ఇరుకున పడుతున్నాయి. కార్యాలయానికి రమ్మన్నందున పలు కంపెనీలకు చెందిన పలువురు ఉద్యోగులు రాజీనామా చేశారు.
ఆఫీస్కు రమ్మంటే రాజీనామా
ఉదాహరణకు మే 12వ తేదీ నాటికి అంతకుముందు 60 రోజుల్లో బైజూస్కు చెందిన వైట్ హ్యాట్ జేఆర్ నుండి వందలాదిమంది ఫుల్ టైమ్ ఉద్యోగులు వెళ్లిపోయారు. బ్లూమ్ బర్గ్ సర్వే ప్రకారం రిమోట్ వర్క్కు తమ మేనేజర్ అనుమతించని పక్షంలో 1000 మంది ఉద్యోగుల్లో 39 శాతం మంది తమ ఉద్యోగం వదిలి వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడైంది.
మిల్లీనియల్స్, జెన్ జెడ్ ఉద్యోగులు ఇంటి నుండి పని చేసి, సరైన ఫలితం ఇస్తారని 49 శాతం మంది అభిప్రాయపడుతున్నారు.
అన్ని దేశాల్లోను
వర్క్ ఫ్రమ్ ఆఫీస్కు ముగింపు పలికి, ఆఫీస్లకు రమ్మని పిలిస్తే, భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉద్యోగులు కంపెనీకి గుడ్ బై చెబుతున్నారు. పాశ్చాత్య దేశాల్లో గ్రేట్ రిజిగ్నేషన్ నవంబర్ నుండి ప్రారంభమైంది. వేతనాలు పెంచకపోవడంతో పాటు, ఆఫీస్ నుండి పని చేయాలనే ఒత్తిడి కారణం. దీంతో ఐటీ కంపెనీలు వర్క్ ఎట్ లొకేషన్ డిమాండ్ పైన వెనక్కి తగ్గుతున్నాయి.
వేతన పెంపు
ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తమ బడ్జెట్ను రెండింతలు చేయనుందని తెలుస్తోంది. ఉద్యోగులకు స్టాక్స్ కేటాయింపుల్లో కనీసం 25 శాతం వృద్ధి, ప్రతిభ ఆధారంగా వేతనాలు పెంచుతామని ప్రకటించింది. ప్రతిభ ఆధారంగా వేతనాలు పెరుగుతాయని ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్ సందేశంలో తెలిపారు. వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా హైబ్రిడ్ విధానంలో ఉద్యోగులు కాస్త ఎక్కువగానే పని చేస్తున్నారు. కంపెనీలు కూడా లాభాలను ఆర్జిస్తున్నాయి. కానీ ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో ఆఫీస్కు రావాలని ఒత్తిడి చేస్తుండటంతో పలువురు ఉద్యోగులు రిజైన్ చేస్తున్నారు.