వచ్చే ఏడాది ఉద్యోగుల వేతనాలు భారీగా పెరిగే అవకాశం
కరోనా నుండి భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోందని, ఈ నేపథ్యంలో ఉద్యోగుల వేతనాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఓ నివేదిక పేర్కొంది. అలాగే వృత్తి నిపణుల కొరత కూడా వేతనాల పెంపుకు దోహదం చేయనుందని తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత దేశంలో ఉద్యోగుల వేతనాలు ఎనిమిది శాతం వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని మైఖేల్ పేజ్ అండ్ అయాన్ పీఎల్సీ అనే సంస్థలు తెలిపాయి. ప్రస్తుత ఏడాదిలో 6 శాతం నుండి 8 శాతం మేర వేతనాలు పెరగనున్నాయని పలు సర్వేలు గతంలో అంచనా వేశాయి.
కొన్నేళ్లుగా ఆసియా దేశాల్లో భారత్లోనే అధిక వేతన పెంపు అమలు అవుతున్నట్లు గుర్తు చేసింది. వచ్చే రెండేళ్లలోను ఇలాగే ఉండవచ్చునని తెలిపింది. ఇ-కామర్స్, ఫార్మా, ఐటీ, ఫైనాన్షియల్ రంగంలో శాలరీ మరింత అధికంగా ఉండే అవకాశముందని నివేదిక పేర్కొంది. రిటైల్, ఏరోస్పేస్, హోటల్, హాస్పిటాలిటీ రంగాలు మాత్రం వేతన పెంపులో వెనుకబడి ఉన్నట్లు తెలిపింది.
కరోనా సమయంలో కన్స్యూమర్ ధరలు పెరిగాయి. ఇందుకు స్వల్పకాలిక సరఫరా సమస్యలు కారణం. అయితే పైన అంచనాలు అన్ని వ్యవస్థీకృత కార్మిక రంగంపై దృష్టి సారించింది. ఇది శ్రామిక శక్తిలో ఇరవై శాతం కంటే తక్కువ. కరోనా నేపథ్యంలో గత ఏడాది కాలంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోయిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే జాబ్ మార్కెట్ కూడా కోలుకుంటోంది.