రూ.7వేల చొప్పున 3 నెలలు శాలరీ ఇవ్వండి: విప్రో అజీమ్ ప్రేమ్జీ
ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులపై ప్రముఖ వ్యాపారవేత్త అజీమ్ ప్రేమజీ గళమెత్తారు. విప్రో గ్రూప్ చైర్మన్ ఆయన అజీమ్ ప్రేమజీ.... దేశంలోనే నిఖార్సైన వ్యాపారవేత్త అని పేరుంది. విలువలు పాటించటంలో, సమాజానికి తిరిగి ఇవ్వటంలో ఆయనకు మరెవరూ సాటిరారు. ఎందుకంటే కొన్ని వందల కోట్ల ఆస్తులను సమాజ అభివృద్ధి కోసం ఉదారంగా దానమిచ్చారు.
అయితే ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలను, వాటిలోని లోపాలను ఎత్తిచూపారు. ముఖ్యంగా వలస కార్మికులు తమ తమ గమ్య స్థానాలకు చేరుకునే లోపే భారత రోడ్లపై మృత్యువాత పడటం క్షమించలేని విషయం అని అయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ది ఎకనామిక్ టైమ్స్ పత్రికలో అజీమ్ ప్రేమ్జీ ఒక ప్రత్యేక వ్యాసం రాశారు. దాని ఆధారంగా మీకోసం కొన్ని వివరాలు.
ఒక పారిశ్రామికవేత్త అయి ఉండి కార్మికులు, వారి హక్కుల కోసం బహిరంగంగా ప్రభుత్వాన్ని నిలదీసే ధైర్యం చేశారు ప్రేమ్ జీ. వ్యాపారవేత్తల ఒత్తిడికి లోనై కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్నాయని, ఆ పధ్ధతి సరికాదని అయన హితవు పలికారు.
ప్రధాని ప్రకటించిన జీడీపీ లో 10% నికి సమానమైన ప్యాకేజీ సరైనదే అయినప్పటికీ అది నిజంగా అమలు జరగాలని, ఆ ప్యాకేజీ పూర్తిగా కొత్తది అయి ఉండాలని సూచించారు. తన 50 ఏళ్ళ సుదీర్ఘ పారిశ్రామిక జీవితంలో ఎప్పుడు కూడా బలవంతపు కార్మిక చట్టాలను అమలు చేయలేదని అయన స్పష్టం చేసారు. అదే సమయంలో అలవికాని ట్రేడ్ యూనియన్లను అనుమతించలేదని చెప్పారు.
ఉద్యోగాలున్నాయి..వర్కర్స్ని ఇవ్వండి: కంపెనీలు, వర్కింగ్ హవర్స్ 12గం.కు పెంచితే ఎక్స్ట్రా శాలరీ
ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యం...
ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో మనమంతా ప్రాథమిక దశలో ఉన్నాం. ఈ దశలో జీవనోపాధితో పాటు జీవించి ఉండటం కూడా ముఖ్యం. అందుకే ఆరోగ్య సంరక్షణను సమగ్ర విధానాలు అవలంభించాలి. ఈ విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి.
గ్రామీణ భారతానికి ఊతమివ్వాలి..
నరెగా పథకాన్ని బాగా విస్తరించాలి. ఇందుకోసం మరో రూ 1 లక్ష కోట్లు కేటాయించాలి. అందరికీ అధిక పని రోజులు కేటాయించాలి. అలాగే రోజువారీ వేతనం కూడా పెంచాలి. సమయానికి డబ్బులు చెల్లించాలి. పట్టణాల్లోనూ సరిగ్గా ఇలాంటిదే ఒక పథకం ప్రవేశపెట్టాలి. అది సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలను దృష్టిలో పెట్టుకుని రూపొందించాలి. ఇది ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఊతమిస్తుంది. ప్రజారోగ్యం పై ప్రభుత్వం నిలకడైన ప్రభుత్వ పెట్టుబడులతో అందరికీ మెరుగైన ఆరోగ్యాన్ని అందించేందుకు తోడ్పడాలి.
వ్యవసాయంలో ప్రభుత్వం అధిక పెట్టుబడుబడులు పెట్టాలి. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరలు కల్పించేందుకు సరైన కొనుగోలు విధానం ఉండాలి. త్వరగా పాడైపోయే వ్యవసాయ ఉత్పత్తుల విస్తరణ, నిల్వ సామర్థ్యం పెంచాలి. గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో స్థానిక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి. పంచాయతీల ద్వారా వారికి మద్దతు లభించే చర్యలు ఉండాలి.
ఆహార భద్రత కు పెద్ద పీట...
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు 3 నుంచి 6 నెలల వరకు ఉచిత రేషన్ అందించాలి. ఇందులో బియ్యం, ఉప్పు, పప్పు సహా సానిటరీ పాడ్, సోప్ కూడా ఉండాలి. అది కూడా ప్రజల ఇంటి వద్దకే డెలివరీ ఇవ్వాలి. ఒక్కో కుటుంబానికి కనీసం 3 నెలల పాటు రూ 7,000 చొప్పున అత్యవసర నిధి లాగా అందించాలి. ఇందుకోసం బయోమెట్రిక్ విధానం లేకుండానే ముందుకు సాగాలి. అలాగే పట్టణాల్లోని పేద ప్రజలకు నెలకు కనీసం 25 రోజుల పని దినాలను కల్పించాలి. లాక్ డౌన్ అయిపోయిన తర్వాత కూడా మరో రెండు నెలల పాటు దీనిని కొనసాగించాలి.
వలస కార్మికులు..
వలస కార్మికులు కోరుకున్న విధంగా వారు ఉన్న చోటే పనిచేయాలి... లేదా వారి సొంత ఊర్లకు వెళ్లాలా అన్న విషయంలో వారికే పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. అలాగే బస్సుల్లో, రైళ్లలో వారిని ఉచితంగా వారి గమ్యస్థానాలకు చేర్చాలి. కంటైన్మెంట్ నిబంధలనలను పాటిస్తూనే దీనిని అమలు చేయాలి. ఆర్థిక ప్యాకేజీ ప్రకటించటమే కాదు దానిని ఎలా వినియోగించాలనేదానికోసం కనీసం ఏడాది, రెండేళ్ల ప్రణాళికలు రూపొందించాలి. ఇందుకోసం నిపుణుల సేవలు వినియోగించుకోవాలి. ప్రజలు, ఆర్థిక వ్యవస్థ వాస్తవంగా కోలుకోవాలంటే ఈ చర్యలు తక్షణావసరం.