ఎలాన్ మస్క్ ట్వీట్లో ఆ ఒక్కమాట: బిట్ కాయిన్ భారీ పతనం, కొత్తగా డోజీకాయిన్
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన ఒక్క ట్వీట్తో బిట్ కాయిన్ వ్యాల్యూ 50వేల డాలర్ల దిగువకు పడిపోయింది. కంపెనీ వాహనాలు కొనుగోలు చేయడానికి బిట్ కాయిన్స్ను అనుమతించబోమని గురువారం ఉదయం మస్క్ ట్వీట్ చేశారు. ఆయన చేసిన ఒక్క ట్వీట్తో బిట్ కాయిన్ వ్యాల్యూ 17 శాతం పడిపోయింది. దీంతో 50వేల డాలర్ల దిగువకు చేరుకుంది. మస్క్ ట్వీట్కు ముందు బిట్ కాయిన్ 54,819 డాలర్లు కాగా, ట్వీట్ తర్వాత 45,700 క్షీణించింది. మార్చి 1వ తేదీ తర్వాత బిట్ కాయిన్ కనిష్ట వ్యాల్యూ ఇది.
కస్టమర్లకు అలర్ట్: బ్యాంకుల్లో కొత్త పనివేళలు, రోజుకు 4 గంటలే
మస్క్ ట్వీట్ చేసిన గంటల్లోనే...
మస్క్ ట్వీట్ చేసిన గంటల్లోనే బిట్ కాయిన్ వ్యాల్యూ 45వేల డాలర్ల స్థాయికి పడిపోయింది. బిట్కాయిన్ ట్రాన్సాక్షన్స్ కోసం శిలాజ ఇంధనాల్ని ముఖ్యంగా ఎక్కువగా ఉద్గారాలను వెలువరిచే బొగ్గు వాడకంపై ఆందోళన చెందుతున్నామని ఎలాన్ మస్క్ ట్వీట్లో పేర్కొన్నారు. చాలా అంశాల్లో క్రిప్టోకరెన్సీ మంచి ఆలోచనేనని, కానీ పర్యావరణానికి ముప్పుగా మారటం సరికాదన్నారు. ఈ ఎలాన్ మస్క్ ట్వీట్ బిట్ కాయిన్ పైన పడింది.
అందుకే బిట్ కాయిన్ జంప్
తమ కార్లు కొనుగోలు చేసేవారు బిట్ కాయిన్ రూపంలో చెల్లించవచ్చునని ఎలాన్ మస్క్ ఈ ఏడాది ప్రారంభంలో పేర్కొన్నారు. అంతేకాదు, ఇందుకోసం 1.5 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు పెట్టారు. వీటిని టెస్లా కొనుగోలు చేసింది. అప్పటి నుండి బిట్ కాయిన్ వ్యాల్యూ అంతకంతకూ పెరుగుతోంది. ఆ తర్వాత మాస్టర్ కార్డ్, వీసా వంటివి కూడా క్రిప్టోకు లేదా బిట్ కాయిన్కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నాయి.
డోజీకాయిన్
కాగా, ఈ మధ్య ఎలాన్ మస్క్ తన ట్వీట్లలో డోజీకాయిన్ అనే క్రిప్టోకరెన్సీ గురించి తరచుగా ప్రస్తావిస్తూ వస్తున్నారు. 2013లో ఈ కరెన్సీ వెలుగులోకి వచ్చింది. మస్క్ ట్వీట్ అండతో డోజీకాయిన్ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ కరెన్సీ వ్యాల్యూ కూడా అంతకంతకూ పెరుగుతోంది. టెస్లా డోజీకాయిన్ చెల్లింపులను స్వీకరించవచ్చా? అని మస్క్ ఈ మధ్య ట్వీట్ చేశారు. దీంతో ఆయన బిట్కాయిన్కు బదులు డోజీకాయిన్వైపు మొగ్గుచూపుతున్నాడన్న ఊహాగానాలు నెలకొన్నాయి.