ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, జుకర్బర్గ్ సంపద రూ.110 లక్షల కోట్లు తగ్గింది
2022 మొదటి ఆరు నెలల కాలంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, ఫేస్బుక్ చీఫ్ మార్క్ జుకర్ బర్గ్ తదితరులు పెద్ద మొత్తంలో తమ సంపదను కోల్పోయారు. వరల్డ్ 500 రిచ్చెస్ట్ పీపుల్ సంపద 2022 మొదటి అర్ధ సంవత్సరంలో 1.4 ట్రిలియన్ డాలర్లు తగ్గింది. కరోనా కష్టకాలంలో వీరి సంపద భారీగా పెరిగింది. కానీ ఈ సంవత్సరం మాత్రం వారి సంపద తగ్గింది.
1.4 ట్రిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో ప్రస్తుత మారకం రేటు ప్రకారం ఈ వ్యాల్యూ రూ.110 లక్షల కోట్లకు పైన. ఇప్పటి వరకు 6 నెలల్లో ప్రపంచ కుబేరుల సంపద నష్టంలో ఇది అత్యధికం. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నికర సంపద దాదాపు రూ.4.90 లక్షల కోట్లు క్షీణించింది. ప్రపంచంలో అత్యంత సంపద కలిగిన రెండో వ్యక్తి జెఫ్ బెజోస్ ఆస్తి రూ.4.98 లక్షల కోట్లు తగ్గింది. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు జుకర్ బర్గ్ నికర సంపద సగానికి పైగా తగ్గింది.
ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా 10 మంది 10,000 కోట్ల డాలర్లకు పైగా ఆస్తి కలిగి ఉండగా జూన్ 30వ తేదీ నాటికి నలుగురు మాత్రమే ఈ మేరకు సంపదను కలిగి ఉన్నారు. మన దేశం విషయానికి వస్తే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ సంపద మాత్రం పెరిగింది. 2022 ప్రథమార్థంలో గౌతమ్ అదానీ సంపద 2200 కోట్ల డాలర్ల మేర పెరిగి 9850 కోట్ల డాలర్లకు, ముఖేష్ సంపద 305 కోట్ల డాలర్లు పెరిగి 9300 కోట్లకు చేరుకుంది.