Employees Fired: కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపులు.. నష్టాలు తగ్గించుకునేందుకేనా..
whitehat jr: గడచిన కొన్ని నెలలుగా చూస్తున్నట్లయితే స్టార్టప్ కంపెనీల్లో ఉద్యోగుల కోత కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఖర్చులను తగ్గించుకునే ఉద్ధేశంతో కంపెనీలు ఈ చర్యలకు పాల్పడుతున్నాయి. మరో పక్క ఇన్వెస్టర్ల నుంచి స్టార్టప్ లను వీలైనంత త్వరగా లాభాల్లోకి నడిపించాలని వ్యవస్థాపకులపై ఒత్తిడి పెరగటం కూడా ఈ చర్యల వెనుక ప్రధాన కారణంగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా పిల్లలకు కోడింగ్ నేర్పించే స్టార్టప్ కంపెనీ వైట్హాట్ జూనియర్ 300 మంది పర్మనెంట్ ఉద్యోగులను తొలగించింది. కరోనా లాక్ డౌన్ సమయంలో ఎడ్ టెక్ స్టార్టప్ కంపెనీలకు దేశంలో ఆదరణ భారీగా పెరిగింది. కానీ ఇప్పుడు ఆ కంపెనీల్లోనే ఎక్కువ ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది.
వేల ఉద్యోగుల తొలగింపు..
దేశంలోని ఎడ్టెక్ కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. ఈ రంగంలో ఉన్న కంపెనీలు ఏడాది కాలంగా సుమారు 5000 మంది ఉద్యోగులను తొలగించాయి. ఆగస్ట్ 2020లో వైట్హాట్ జూనియర్ని ప్రముఖ ఎడ్ టెక్ సంస్థ బైజూస్ దాదాపు రూ.2,250 కోట్లకు పైగా చెల్లించి కొనుగోలు చేసింది. కోడింగ్ నేర్పించే టీచింగ్, సేల్స్ టీమ్ ఉద్యోగులను కంపెనీ తొలగించింది. తొలగించిన వారిలో దాదాపు 80 మంది కంపెనీ బ్రెజిల్ కార్యాలయంలో పనిచేస్తున్నారు. గతేడాది ఏప్రిల్లో బ్రెజిల్లో బైజూస్ కంపెనీ అరంగేట్రం చేసింది.
తొలగించిన వారికి చెల్లింపులు..
ప్రముఖ వార్తా సంస్థ అడిగిన ప్రశ్నకు కంపెనీ ప్రతినిధి స్పందిస్తూ.. వైట్హాట్ జూనియర్ దృష్టి యువ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు బలమైన వ్యాపారాన్ని నిర్మించడం కూడా అని తెలిపారు. అందుకు తగ్గట్టుగానే కంపెనీ తన వ్యూహాలను అమలు చేస్తోందని ఆయన వెల్లడించారు. తొలగించిన ఉద్యోగులకు ఒక నెల జీతం ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఇచ్చిన సమాచారం ప్రకారం.. 2021 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.1,690 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఈ కాలంలో కంపెనీ ఆదాయం రూ.483.9 కోట్లు ఉండగా.. మొత్తం వ్యయాలు రూ.2,175.2 కోట్లకు చేరుకున్నాయి.
ఏఏ సంస్థలు ఉద్యోగులను తొలగించాయంటే..
బైజూస్ ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్కి చెల్లింపులను ఆలస్యం చేసింది. కంపెనీ దీనిని ఏప్రిల్ 2021లో రూ.7,125 కోట్లకు పైగా చెల్లించికొనుగోలు చేసింది. ఇదే సమయంలో గత కొన్ని నెలలుగా, Uncademy Group, Lido Learning, Vedantu సహా అనేక edtech కంపెనీలు తమ ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగించాయి. మేలో ఎడ్ టెక్ యూనీకార్న్ Vedantu 624 మంది ఉద్యోగులను తొలగించింది. అదేవిధంగా ఫ్రంట్రో కూడా 145 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 30 శాతంగా ఉంది. జూన్లో ఇన్ఫోఎడ్జ్ పెట్టుబడి పెట్టిన స్టార్టప్ కంపెనీ ఉదయ్ కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇలా ఎడ్ టెక్ స్టార్టప్ కంపెనీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.