DHFL case: కపిల్ వాద్వాన్ రూ.3 వేల కోట్ల ఆస్తులను గుర్తించిన ఈడీ, త్వరలో అటాచ్
నిధుల కొరత వల్ల రుణాల మంజూరు నిలిచిపోవడం, 2018 ద్వితీయార్ధం నుంచి ఒత్తిడి ఎక్కువవడంతో దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్) నష్టాల ఊబిలోకి చిక్కిన సంగతి తెలిసిందే. బిజినెస్ సాగకపోవడంతో ఇన్వెస్టర్లు తమ షేర్లను వెనక్కి తీసుకున్నారు. అయితే మరికొందరి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడి ఇవ్వాలని ఎన్ఫోర్స్మెండ్ డైరెక్టరేట్ను ఆశ్రయించడంతో డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీ ప్రమోటర్ కపిల్ వాద్వాన్ ఆస్తులను గుర్తించే పనిలో ఈడీ బిజీగా ఉంది.
విదేశాల్లో కూడా..
భారత్తోపాటు విదేశాల్లో కపిల్ వాద్వాన్కు ఉన్న ఆస్తులను ఈడీ గుర్తించింది. రూ.3 వేల కోట్ల విలువగల 20 స్థిరాస్తుల వివరాలను అధికారులు శుక్రవారం మీడియాకు తెలిపారు. ఆస్తుల మొత్తాన్ని మరికొద్ది వారాల్లో అటాచ్ చేస్తామని పేర్కొన్నారు.
వెయ్యి కోట్ల స్థలం..
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో 12 వేల చదరపు అడుగులు స్థలం కపిల్ వాద్వాన్పై ఉందని ఈడీ గుర్తించింది. దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ.వెయ్యి కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. థాయ్లాండ్లోని కొశాముల్లో విల్లా ఉంది.. ఇది రూ.50 కోట్లు ఉంటుందని చెప్పారు. అమెరికా, లండన్లో ఇల్లు, కార్యాలయాలు, మిగతా దేశాల్లో ప్లాట్లు కూడా ఉన్నాయని తెలిపారు. భారతదేశంలో ఖార్, ముంబైలో గల ప్లాట్లు రూ.125 కోట్లు ఉంటుందని లెక్కగట్టారు.
లాభాల నుంచి నష్టాల్లోకి..
2017-18 ఆర్థిక సంవత్సరంలో 1240 కోట్ల లాభాన్ని డీఎల్ఎఫ్హెచ్ ఆర్జించింది. కానీ మరుసటి ఏడాది మాత్రం 1036 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. గతేడాది జూలైలో కంపెనీ నష్టాల్లో ఉందని ప్రకటించగానే షేర్ విలువ 30 శాతం పతనమైంది. దీంతో కంపెనీ కొలుకోలేని స్థితికి చేరుకుంది. పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు ఒక్కొక్కరు బయటకి రాగా.. కంపెనీ దివాలా తీసింది.
41 వేల కోట్లు చెల్లింపు
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో ద్రవ్య కొరత వల్ల సమస్య వచ్చిందని, కంపెనీలో బాండ్ల రూపంలో పెట్టుబడులు పెట్టినవారికి రూ.41 వేల 800 కోట్లు అందజేశామని ఇదివరకే కపిల్ వాద్వాన్ ప్రకటించారు. కానీ ఇన్వెస్టర్ల నుంచి ఒత్తిడి రావడంతో ఆయన చేతులేత్తేశారు. మరికొందరు ఇన్వెస్టర్ల ఫిర్యాదుతో ఈడీ రంగంలోకి దిగింది.