ట్రాక్లోకి భారత ఆర్థిక వ్యవస్థ, ఊహించిన దానికి మించి వేగం: గుడ్న్యూస్ చెప్పిన జవదేకర్
కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న భారత ఆర్థిక వ్యవస్థలో అంచనాలకు మించిన వృద్ధి కనిపిస్తోందని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ బుధవారం అన్నారు. జీఎస్టీ కలెక్షన్లు ఎనిమిది నెలల గరిష్టానికి చేరుకోవడం, పవర్ డిమాండ్ పెరగడం, ఆటో సేల్స్ వంటివి గరిష్టాన్ని తాకడం వంటివి ఇందుకు నిదర్శనంగా చెప్పారు. రైలు సరకు రవాణా పెరిగినట్లు తెలిపారు. ఎఫ్డీఐ పెట్టుబడులు కూడా పెరిగాయని తెలిపారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుంటే ఎకనమిక్ రికవరీ వేగంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోందని, రెండో క్వార్టర్ ఆశాజనకంగా ఉందన్నారు.
కస్టమర్లకు ఐసీఐసీఐ ఝలక్, క్యాష్ డిపాజిట్పై కన్వీనియెన్స్ ఫీజు, వారికి ఊరట..
ట్రాక్లోకి ఆర్థిక వ్యవస్థ
భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా ట్రాక్లోకి వస్తోందని ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఊహించిన దానికి మించిన రికవరీ కనిపిస్తోందన్నారు. భారీ వర్షాల కారణంగా వ్యవసాయ రంగంలో విద్యుత్ వినియోగం తగ్గినప్పటికీ, రైల్వేస్ పూర్తిగా కార్యకలాపాలు ప్రారంభించనప్పటికీ పవర్ డిమాండ్ పెరగడం గమనార్హమని తెలిపారు. ఇది విద్యుత్ డిమాండ్ పెరుగుదులకు, తద్వారా ఉత్పత్తి పెరుగుదలకు నిదర్శనం అన్నారు. రైల్వే, వ్యవసాయ రంగంలో తక్కువ విద్యుత్ వినియోగం ఉన్నప్పటికీ 12 శాతం పెరిగిందని, ఉత్పత్తి సాధారణ స్థితికి రావడాన్ని ఇది సూచిస్తోందన్నారు.
FDIలు 13 శాతం జంప్
భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఏప్రిల్ ఆగస్ట్ కాలంలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ 13 శాతం పెరిగినట్లు ఎకనమిక్ అఫైర్ సెక్రటరీ తరుణ్ బజాజ్ తెలిపారు. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సంకేతాలు వివిధ రంగాల్లో కనిపిస్తున్నాయి.
రికవరీ స్పీడ్... ఇవే నిదర్శనం
2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు 23.9 శాతం ప్రతికూలత నమోదు చేసిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా ప్రపంచ దేశాలు అతలాకుతలమయ్యాయి. మన దేశం ఇందుకు మినహాయింపు కాదు. ప్రజల ప్రాణాల కోసం సుదీర్ఘ లాక్ డౌన్ విధించడం వల్ల మన ఆర్థిక వ్యవస్థపై ఎక్కువ ప్రభావం పడింది. కానీ అక్టోబర్ నెలలో జీఎస్టీ కలెక్షన్లు రూ.1 లక్ష కోట్లు దాటి ఎనిమిది నెలల గరిష్టాన్ని తాకాయి. వాహనాల సేల్స్ కూడా రికార్డ్ స్థాయికి పుంజుకున్నాయి. వ్యవసాయ రంగం బాగుంది. విదేశీ పెట్టుబడులు కూడా భారీగా పెరిగాయి. ఉద్యోగిత రేటు పెరుగుతోంది. ఇవన్నీ వేగవంత రికవరీకి నిదర్శనంగా చెబుతున్నారు.