అందరి దృష్టి సీతారామన్ బడ్జెట్ పైనే: 2020లో డిమాండ్, ఉద్యోగాలు పెరగవచ్చు!
న్యూఢిల్లీ: ఆర్థికమందగమనం నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పైన అందరి కళ్లూ ఉన్నాయి. జీడీపీ రేటు వరుసగా రెండు క్వార్టర్లలో 5 శాతానికి, 4.5 శాతానికి తగ్గింది. అప్పటికే మోడీ ప్రభుత్వం వివిధ ఉద్దీపనలు ప్రకటించింది. అయితే ఇది ఆశించిన మేర ప్రయోజనం కలగలేదనేది కొందరి అభిప్రాయం. లాంగ్ టర్మ్కు ఉపయోగపడుతుందని మరికొందరి వాదన. ఏదేమైనా తీవ్ర మందగమన పరిస్థితుల్లో సీతారామన్ బడ్జెట్ ఎలా ఉంటుందనే చర్చ సాగుతోంది.
HDFC గుడ్న్యూస్: ఈ నెంబర్కు ఫోన్ చేస్తే మీ ఇంటికి సేవలు
ఉద్యోగాలు, ఆదాయ మార్గం కోసం..
ద్రవ్యలోటు కట్టడి విషయంలో ప్రభుత్వం ఈశారి పట్టువిడుపు ధోరణిలో ఉండే అవకాశముందని అంటున్నారు. గతంలో కంటే ద్రవ్యలోటు చూపించి వ్యయం పెంచే అంశాలపై దృష్టి సారించవచ్చు. ఈ వ్యయాన్ని ఇన్ఫ్రాపై ఎక్కువగా పెట్టే అవకాశాలన్నాయి. దీంతో ఉద్యోగాలు వస్తాయి. పైగా ప్రభుత్వానికి మరింత రెవెన్యూ సమకూరుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న ప్రాజెక్టుల కోసం వ్యయం చేయవచ్చునని అంటున్నారు.
పన్నులు..
ఇప్పటికే కార్పోరేట్ ట్యాక్స్ భారీగా తగ్గించారు. ఆదాయపు పన్ను స్లాబ్లో మార్పులు ఉంటాయనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు, జీఎస్టీ సమస్యలను పరిష్కరించి మరింత సరళతరం చేయవచ్చు. క్రమంగా పన్ను వసూళ్లు పెరిగేలా సరళతరం చేయవచ్చునని చెబుతున్నారు.
ఇలా నగదు పంపిణీ
మందగమనాన్ని ఎదుర్కోవడానికి వ్యవస్థలోకి లక్షల కోట్లు జొప్పించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. కానీ రెవెన్యూ తగ్గడంతో ప్రభుత్వం ఆదాయం తగ్గింది. పీఎం కిసాన్, పన్ను మినహాయింపులు వంటి వాటి ద్వారా నగదు నిల్వలు పెంచి, వ్యవస్థలోకి నగదును పంపించే అవకాశముంది. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా కూడా ఆదాయం సమీకరించుకోనుంది.
ఉపాధికి ప్రోత్సాహం
ఎక్కువమందికి ఉపాధి కల్పించే రంగాలకు ప్రోత్సాహకాల ద్వారా ఉద్యోగా కల్పన పెంచే అవకాశాలు ఈ బడ్జెట్లో ఉండవచ్చునని అంటున్నారు. డిమాండ్ లేమి కారణంగా రుణాలు చెల్లించలేని సంస్థలకు ఊరటను కలిగించే అవకాశాలు ఉన్నాయి.
ఈ ఏడాది ఉద్యోగాలు, డిమాండ్ పెరగవచ్చు
జీడీపీ వృద్ధి రేటు ఇటీవల 11 ఏళ్ల గరిష్టానికి పడిపోయింది. ఈ పరిస్థితుల్లో దివాలా చట్టం వంటి వాటి ద్వారా బ్యాంకులకు నగదు లభ్యత పెరిగింది. దీంతో మరింత అప్పు ఇచ్చే పరిస్థితి వచ్చింది. మరోవైపు మధ్యలో జీఎస్టీ రెవెన్యూ తగ్గినా ఏడాది చివరలో పెరిగాయి. ఇది ఊరట కలిగించే అంశం. బీఎస్ 6 అమలులోకి వచ్చాక కొనుగోళ్లు పెరిగే అవకాశాలతో పాటు ఉద్యోగాలు పెరగవచ్చునని అంచనా.