భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది.. కానీ, కేంద్రం స్పందించకుంటే..
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇటీవల ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా తెరుచుకుంటుండటంతో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని, కానీ బలహీనంగా అని బ్రిక్ వర్క్ రేటింగ్ నివేదిక వెల్లడిస్తోంది. ఆర్థిక వ్యవస్థలో పురోగతి కనిపిస్తున్నా ప్రతికూల సంకేతాలు తొలగిపోలేదని అభిప్రాయపడింది. జూలై - సెప్టెంబర్ త్రైమాసికానికి వృద్ధిరేటు 13.5 శాతం ప్రతికూలత, 2020-21 పూర్తి ఆర్థిక సంవత్సరానికి 9.5 శాతం ప్రతికూలత నమోదు చేయవచ్చునని అంచనా వేసింది. అయితే కేంద్రం తక్షణ వృద్ధిచర్యలు చేపడితే ప్రతికూలత తగ్గుతుందని అభిప్రాయపడింది. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు వెంటనే చర్యలు చేపట్టకుంటేనే మైనస్ 9.5 శాతం నమోదవుతుందని అంచనా వేసింది.
గుడ్న్యూస్, వాట్సాప్లో EPFO సేవలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నెంబర్లు ఇవే...
సానుకూల సంకేతాలు కానీ
కరోనా, ప్రపంచంలో సుదీర్ఘ లాక్డౌన్ కారణంగా ఆరునెలల పాటు ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొందని, ఇప్పుడు ఎట్టకేలకు సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయని, ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్నట్లు కొన్ని కీలక సూచీలు తెలియజేస్తున్నాయని ఈ నివేదిక పేర్కొంది. పీఎంఐ, జీఎస్టీ వసూళ్లు, వాహనాల విక్రయాలు, ఎగుమతులు, పవర్ డిమాండ్ ఆశాజనకంగా ఉన్నట్లు బ్రిక్ వర్క్ రేటింగ్స్ తెలిపింది. ఆగస్ట్లో పీఎంఐ 52గా ఉండగా, సెప్టెంబర్ మాసంలో 56.8 పాయింట్లకు చేరుకుందని, జీఎస్టీ వసూళ్లు రూ.95,480 కోట్లుగా ఉన్నాయని, 2019 సెప్టెంబర్ నెలతో పోలిస్తే ఇది 3.8 శాతం అధికమని తెలిపింది. అదే ఈ ఆగస్ట్తో చూస్తే పది శాతం అధికం.
ఇవీ పుంజుకున్నాయి
ప్యాసింజర్ వెహికిల్ సేల్ 31 శాతం పుంజుకున్నాయి. రైల్వే సరుకు రవాణా రద్దీ 15 శాతం పెరుగుదలను నమోదు చేసింది. వ్యాపార ఎగుమతులు 5.3 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఇంజినీరింగ్ గూడ్స్, పెట్రోలియం ఉత్పత్తులు, ఔషధ, రెడీమేడ్ దుస్తులకు డిమాండ్ పెరిగింది. విద్యుత్ డిమాండ్, ఉత్పత్తి పెరిగింది. అయితే మూలధన వ్యయం, కీలక రంగాలు, క్రెడిట్ డిపాజిట్ రేషియోలపై ఆందోళన వ్యక్తం చేసింది. జూలై-సెప్టెంబర్ మాసంలో కొత్త ప్రాజెక్టులపై మూలధన వ్యయం ఏకంగా 81 శాతం తగ్గిందని, ఇది పెట్టుబడుల క్షీణతకు నిదర్శనమని తెలిపింది. ఆగస్ట్లో కీలక రంగాల వృద్ధి మైనస్ 8.5 శాతంగా ఉందని, క్రెడిట్-డిపాజిట్ నిష్పత్తి సెప్టెంబర్ 11తో ముగిసిన 45 రోజుల్లో పడిపోయిందని, బంగారం, చమురు మినహా ఇతర దిగుమతులు క్రమంగా క్షీణిస్తున్నాయని తెలిపింది.
అన్ని రంగాలు ఢీలా..
మొదటి క్వార్టర్లో జీడీపీ వృద్ధి రేటు 23.9 శాతం ప్రతికూలత నమోదు చేసిన విషయం తెలిసిందే. మొదటి క్వార్టర్లో వ్యవసాయం, అనుబంధ రంగాలు మాత్రమే వృద్ధిని నమోదు చేశాయి. మిగతా అన్ని రంగాలు ప్రతికూలతను నమోదు చేశాయి. నిర్మాణ రంగంలో 50.3 శాతం ప్రతికూలత నమోదయింది. ఆ తర్వాత ట్రేడ్, హోటల్స్, ట్రాన్సుపోర్ట్, స్టోరేజ్, కమ్యూనికేషన్ 47 శాతం ప్రతికూలత నమోదు చేసింది. మ్యానుఫ్యాక్చరింగ్ మైనస్ 39.3 శాతంగా ఉంది.