ఆన్ లైన్ లో నకిలీ ప్రోడక్టులు అమ్మితే జైలుకే: మార్చి నుంచి అమల్లోకి ఈకామర్స్ కొత్త పాలసీ
ఏదైనా ప్రోడక్ట్ కొనుగోలు చేసేప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఒక ఆందోళన ఉండి తీరుతుంది. మనకు డెలివరీ అయ్యే ప్రొడెక్టు ఒరిజినలేనా కాదా అనే అనుమానం వెంటాడుతుంది. ఆన్లైన్ అమ్మకాలు మొదలైన తొలినాళ్లలో ఈ బెడద చాలా అధికంగా ఉండేది. ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి దిగ్గజాల రాకతో కొంత తగ్గింది. కానీ ఇటీవలి కాలంలో సెల్లర్లు ఈ రెండు ప్లాటుఫార్మ్స్ కూడా వదలటం లేదు. ఒరిజినల్ బ్రాండ్ పేరుతో వినియోగదురలకు నకిలీ వస్తువులను సరఫరా చేసి వారిని బురిడీ కొట్టిస్తున్నారు.
దీనిపై కొందరు వినియోగదారులు కన్స్యూమర్ ఫోరమ్ లను ఆశ్రయిస్తుండగా.. మరికొందరు మన ఖర్మరా బాబూ అంటూ వదిలేస్తున్నారు. అయితే, ఆన్లైన్ లో ఇలా మోసం చేసే అమ్మకందార్లకు (వెండార్స్ )కు చెక్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు త్వరలో తీసుకు రాబోతున్న ఈకామర్స్ పాలసీ లో కఠినమైన నిబంధనలను పొందుపరుస్తోంది. ఏవైరైనా నిబంధనలు అతిక్రమమించి వినియోగదారులను మోసం చేయాలని చూస్తే వారిని జైలు ఊచలు లెక్కించే విధంగా రూల్స్ ఉండబోతున్నాయని సమాచారం.
అమెరికా తరహా విధానం...
ప్రస్తుతం అమెరికాలో ఒక్క ఈకామర్స్ అని కాకుండా ప్రతి రంగంలోనూ వినియోగదారులకు రక్షణ లభిస్తుంది. వారు కొనుగోలుచేసిన వస్తువు ఎంత చిన్నదైనా సరే... అది నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేదంటే కస్టమర్లు వినియోగదారుల ఫోరమ్స్ ఆశ్రయిస్తారు. అది నిజమని తేలితే ఇక సదరు ప్రోడక్ట్ విక్రయించిన కంపెనీకి మిలియన్ డాలర్ల లో ఫైన్ వేస్తారు. జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ వాడకం వల్ల ఆరోగ్య సమస్య తలెత్తిందని ఒక కస్టమర్ దావా వేస్తే... అది నిజమని నిరూపితమైంది.
ఇక అంతే... అక్కడి కోర్టు ఏకంగా 572 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. సరిగ్గా ఇలాంటి కఠినమైన రూల్స్ కొత్త ఈకామర్స్ పాలసీ లో ఉండేలా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది. అదే సమయంలో ఒక ఉత్పత్తి నాణ్యత లోపానికి కేవలం థర్డ్ పార్టీ (సెల్లర్) మాత్రమే బాధ్యుడు కాకుండా... ఆ ప్రోడక్ట్ విక్రయించిన ఆన్లైన్ ప్లాట్ఫారం కూడా బాధ్యత వహించేలా నిబంధనలు రూపొందిస్తున్నారు.
మార్చిలో కొత్త పాలసీ...
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈకామర్స్ విధానం డ్రాఫ్ట్ ను విడుదల చేసింది. దీనిపై అన్ని వర్గాల నుంచి ఒపీనియన్స్ సేకరిస్తోంది. అయితే, వినియోగదారుల రక్షణ కొరకు, అలాగే విపరీతమైన నకిలీ ప్రొడక్టుల విక్రయం, అబద్ధపు ఆఫర్ల ప్రకటనలను కూడా నిషేధించేలా కఠిన నిబంధనలు ఉండాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఏఐటి) ప్రభుత్వాన్ని కోరుతోంది.
అందరి అభిప్రాయాల సేకరణ పూర్తయిన తర్వాత, వచ్చే మార్చి నెలలో కొత్త ఈకామర్స్ విధానాన్ని ప్రకటించనుంది. ఇందులో కఠిన నిబంధనలు, భారీ పెనాల్టీలు, జైలు శిక్షలు ఉంటాయని సమాచారం. దీంతో ఇకపై నకిలీ వస్తువు విక్రయించాలంటే ఎవరికైనా వెన్నులో వణుకు వచ్చేలా నిబంధనలు ఉండబోతున్నాయి.
మేడి పండు చందం...
ఇండియా లో వినియోగదారుల రక్షణ పైకి చాలా పటిష్టంగా కనిపించినా... అది అమలు అయ్యే దాఖలా కనిపించదు. నూటికి 95% కేసులు అసలు ఫిర్యాదు స్థాయికి కూడా వెళ్లవు. మిగిలిన 5% కేసుల్లోనూ తీర్పు వెలువడి ఖరారయ్యేది ఏ ఒకటో రెండో కేసుల్లోనే జరుగుతోంది. అందుకే, ఇండియాలో కంపెనీలు, విక్రేతలు ఎలాంటి వస్తువునైనా వినియోగదారునికి అంటగట్టగలం అనే విశ్వాసంతో ఉంటారు.
అసలు వారికి చట్టంపై భయం లేకుండా పోయిందని చెప్పాలి. అయితే, ఇటీవల ఫిర్యాదుల స్వీకరణ కాస్త సులభతరం చేశారు. కేవలం ఇమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినా దానిని కన్స్యూమర్ ఫోరమ్ స్వీకరిస్తోంది. ఈ నేపథ్యంలో వినియోగదారులు కొంత వరకు ముందుకొచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని ఎదురిస్తున్నారు. సెల్లర్స్ కు తగిన శిక్ష పడేలా చేయగలుగుతున్నారు. ఇక మీదట ఈకామర్స్ పాలసీ కూడా సరళంగా ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తే... పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఆ సేవలు వినియోగించుకునే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.