డాక్టర్ రెడ్డీస్పై సైబర్ అటాక్, ప్రపంచవ్యాప్తంగా ప్లాంట్స్ క్లోజ్: వ్యాక్సీన్ టార్గెట్?
హైదరాబాద్: భాగ్యనగరానికి చెందిన ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ పైన సైబర్ దాడి జరిగింది. కంపెనీకి చెందిన ఐటీ విభాగాలపై సైబర్ దాడి జరిగినట్లు ఈ సంస్థ స్టాక్ ఎక్స్చేంజీ ఫైలింగ్లో గురువారం తెలిపింది. తమ సంస్థకు చెందిన ఐటీ విభాగాలపై సైబర్ దాడిని గుర్తించామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో అవసరమైన నివారణ చర్యల్లో భాగంగా అన్ని డేటా సెంటర్లను ప్రత్యేకంగా ఉంచి, పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది.
ఈ సైబర్ అటాక్ ఎవరు, ఎక్కడి నుండి చేశారో తెలియాల్సి ఉంది. సంస్థ కార్యకలాపాలపై దీని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చునని సీఈవో ముఖేష్ రాఠీ అన్నారు. 24 గంటల్లో కార్యకలాపాలు యథాస్థితికి వస్తాయని ఆశాభావం వ్యక్తి చేశారు.
హోంలోన్, డిస్కౌంట్... యస్ బ్యాంకు అదిరిపోయే పండుగ ఆఫర్లు
సైబర్ అటాక్ పైన విచారణ
భారత్తో పాటు అమెరికా, లండన్, బ్రెజిల్, రష్యాలోని ఆయా కంపెనీల్లో ఉత్పత్తిని నిలిపివేసినట్లు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. సైబర్ అటాక్ వల్ల నష్టం జరిగినట్లు చెబుతోంది. ఈ దాడిపై ఫిర్యాదు చేశామని, ఎవరు చేశారనే అంశంపై విచారణ సాగుతోందని వెల్లడించింది. భారతీయ ఫార్మా కంపెనీపై మేజర్ సైబర్ దాడి జరగడం గమనార్హం. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్కు భారత్లో 17 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, ఆరు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (R&D) ఫెసిలిటీస్ ఉన్నాయి. విదేశాల్లో 6 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, మూడు ఆర్ అండ్ డీ సెంటర్స్ ఉన్నాయి.
వ్యాక్సీన్ హ్యూమన్ ట్రయల్స్..
రష్యా కరోనా వ్యాక్సీన్ స్పుత్నిక్-వీ 2, 3 దశల హ్యూమన్ ట్రయల్స్ నిర్వహణకు డాక్టర్ రెడ్డీస్కు డీసీజీఐ ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సీన్ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తోంది. రష్యా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సీన్ ట్రయల్స్ను భారత్లో నిర్వహించడంతో పాటు ఇక్కడ సరఫరా చేసేందుకు ఆర్డీఐఎఫ్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో సైబర్ దాడి జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.
వ్యాక్సీన్ ప్రయోగాల సమయంలో..
కరోనా వ్యాక్సీన్ కోసం ప్రయోగాలు జరుగుతున్న తరుణంలో ఔషధ తయారీ సంస్థలను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారు. వ్యాక్సీన్కు సంబంధించిన డేటా చోరీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. సైబర్ దాడి నేపథ్యంలో డాక్టర్ రెడ్డీస్ స్టాక్స్ ఈ రోజు స్వల్ప నష్టాలను చూశాయి. స్టాక్స్ 0.35 శాతం నష్టపోయి రూ.5,029 వద్ద ముగిసింది. ఈ రోజు ఫార్మా స్టాక్స్ మొత్తం నష్టాల్లో ముగిశాయి. సిప్లా 1 శాతం, అరబిందో ఫార్మా 3.37 శాతం నష్టపోయింది.