ఎల్ఐసీ స్టేక్ సేల్ కోసం FDI పాలసీలో కీలక మార్పులు
కేంద్ర ప్రభుత్వం ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్(FDI) పాలసీలలో కీలక మార్పులు చేయనుంది. ప్రభుత్వరంగ బీమా సంస్త లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) పెట్టుబడుల ఉపసంహరణ సులభతరం కావడం కోసం ఈ మార్పులు చేయనుంది. ఈ మేరకు ఆర్థికమంత్రిత్వ శాఖతో చర్చలు జరిపారు. అలాగే ఈ-కామర్స్ పాలసీ కూడా చివరి స్టేజీలో ఉందని టాప్ గవర్నమెంట్ అఫీషియల్ ఒకరు తెలిపారు. ఆర్థికమంత్రిత్వ శాఖ నుండి అభిప్రాయ సేకరణ తర్వాత వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ మేరకు FDI పాలసీలో మార్పులు చేస్తున్నట్లు డిపార్టుమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(DPIIT) సెక్రటరీ అనురాగ్ జైన్ అన్నారు.
ప్రస్తుత పాలసీతో ఎల్ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణ కుదరదని, అందుకే త్వరగా సవరణలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో FDI పాలసీని మరింత సరళీకరిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు ఇప్పటికే ఆర్థిక సేవల శాఖతో పాటు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖతో చర్చించినట్లు తెలిపారు. త్వరలో కేబినెట్ ఆమోదం లభిస్తుందన్నారు.
ప్రస్తుత పాలసీ ప్రకారం దేశీయ బీమా రంగంలోకి ఆటోమేటిక్ మార్గం కింద 74 శాతం FDIకి అనుమతి ఉంది. ఇది ఎల్ఐసీకి వర్తించదు. ప్రత్యేక చట్టం ద్వారా ఎల్ఐసీ నడుస్తోంది. అందుకే దీనికి వర్తించదు. మార్కెట్ రెగ్యులేటర్ సెబి నిబంధనల ప్రకారం పబ్లిక్ ఇష్యూలో FDI, FPIకి అనుమతి ఉంది. కానీ ఎల్ఐసీ ప్రత్యేక చట్టం దీనికి దూరం. దీంతో ఎల్ఐసీ ఐపీవోలో సెబి నిబంధనలకు తిగినట్లు విదేశీ ఇన్వెస్టర్లు పాల్గొనేలా సవరణలు చేస్తున్నారు.