నాన్ టెలికాం కంపెనీలకు తిప్పలు: రూ 3.3 లక్షల కోట్ల కొత్త భారం!
సుప్రీమ్ కోర్ట్ తీర్పు నేపథ్యంలో నాన్- టెలి కాం కంపెనీలకు కొత్త చిక్కొచ్చి పడింది. ఏజీఆర్ ఫీజుల చెల్లింపు కేవలం టెలికాం కంపెనీలకే కాకుండా ఇతర కంపెనీలకు కూడా వర్తిస్తుందని సుప్రీమ్ కోర్ట్ తీర్పు చెప్పడటంతో... డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం (డాట్) సంబంధిత కంపెనీలకు నోటీసులు పంపుతోంది. వాటి నుంచి మొత్తంగా రూ 3.3 లక్షల కోట్ల బకాయిలు రావాలని అందులో పేర్కొంటోంది. ఏజీఆర్ వల్ల ఇప్పటికే ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్ కంపెనీలు చాలా కష్టాల్లోకి వెళ్లిపోయాయి. ఐడియా-వోడాఫోన్ అయితే ఏకంగా ప్రభుత్వం కొంత సమయం ఇవ్వకపోతే దివాళా తీసే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఒక్కో కంపెనీ సుమారు రూ 40,000 కోట్ల మేరకు ప్రభుత్వానికి బకాయిలు చెల్లించాల్సి ఉంది.
అన్ని టెలికాం కంపెనీల నుంచి రూ 1.47 లక్షల కోట్ల బకాయిలు రావాలని ప్రభుత్వం ఇప్పటికే టెలికాం కంపెనీలకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసింది. అయితే, ఇప్పుడు వీ షాట్, ఐఎస్పీ లైసెన్సులు కలిగి ఉన్న నాన్ టెలికాం కంపెనీలు అంతకు రెట్టింపు మొత్తంలో చెల్లించాల్సి రావటం గమనార్హం. ఈ నిర్ణయ ఫలితం ఎలా ఉంటుందోనని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికిప్పుడు కంపెనీలు ఇంత భారీ మొత్తాల్లో బకాయిలు చెల్లించే అవకాశం, నిధుల లభ్యత ఉండదు కాబట్టి అవి మళ్ళీ కోర్టులను ఆశ్రయిస్తామని అంటున్నారు.
ప్రభుత్వానికి భారీ ఊరట: ఏపీ-తెలంగాణ కలెక్షన్లు ఎంతంటే?
గుజరాత్ నర్మదా వాలీ ఫెర్టిలైజర్ కు రూ 15,000 కోట్ల నోటీసు...
డాట్ ఇటీవల పంపిన నోటీసుల్లో తాజాగా గుజరాత్ నర్మదా వాలీ ఫెర్టిలైజర్స్ కెమికల్స్ కంపెనీ చేరిపోయింది. జనవరి 23, 2020 లోగా రూ 15,019 కోట్ల బకాయిలను చెల్లించాలని ఈ కంపెనీకి నోటీసు అందింది. ఆఫీస్ ఆఫ్ కంట్రోలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్ అనే సంస్థ డిసెంబర్ 23, 2019 న కంపెనీకు నోటీసు జారీ చేసింది. వీ షాట్, ఐ ఎస్ పీ లైసెన్సులు కలిగి ఉన్నందుకు 2005-06 నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరాలకు గాను ఈ మొత్తంలో బకాయిలు చెల్లించాల్సి ఉంటుందని తన నోటీసు లో పేర్కొంది. అయితే, దీనిపై కంపెనీ ప్రస్తుతం నిపుణుల సలహా తీసుకొంటోంది. సుప్రీమ్ కోర్ట్ తీర్పు నేపథ్యం, డిమాండ్ నోటీసు అంశాలపై లీగల్ అడ్వైజ్ తీసుకుంటుంది . దానికనుగుణంగా తన తదుపరి చర్యలు ఉంటాయని గుజరాత్ నర్మదా వాలీ ఫెర్టిలైజర్స్ పేర్కొంది. ఈ విషయాన్నీప్రముఖ వార్త ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) వెల్లడించింది.
ప్రభుత్వ రంగ సంస్థల బకాయిలు అధికం...
నాన్ టెలికాం కంపెనీల నుంచి ఏజీఆర్ బకాయిలు ఉన్న కంపెనీల్లో ప్రభుత్వరంగ సంస్థలవే అధికంగా ఉన్నాయి. గతంలోనే డాట్ గెయిల్ నుంచి రూ 1.72 లక్షల కోట్లు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుంచి రూ 1.25 లక్షల కోట్ల బకాయిలు రావాల్సి ఉందని వెల్లడించింది. ఆ మేరకు ఈ రెండు సంస్థలకు కూడా డిమాండ్ నోటీసు లు జారీ చేసింది. అయితే, ఈ రెండు ప్రభుత్వ రంగ సంస్థలు డాట్ కు షాక్ ఇచ్చాయి. తాము వినియోగించిన దానికి లైసెన్స్ ఫీజు చెల్లించామని, ఇక చెల్లించాల్సిందేమి ఉండదని గెయిల్ తన లేఖలో పేర్కొంది. కాగా పవర్ గ్రిడ్ అయితే లైసెన్స్ తీసుకున్నా తాము దాని మీద ఎటువంటి వ్యాపారం చేయలేదు అని వెల్లడించింది.
సుప్రీమ్ కోర్ట్ ఏం చెప్పిందంటే...
ప్రభుత్వం నుంచి స్పెక్ట్రమ్, ఎయిర్ వేవ్స్ లైసెన్సులు పొందిన సంస్థలు ఆయా లైసెన్సుల ద్వారా ఆర్జించిన ఆదాయాన్ని ఫీజుల లెక్కింపునకు ఉపయోగించాలని సుప్రీమ్ కోర్ట్ సూచించింది. ఈ మేరకు గతేడాది అక్టోబర్ 24న తన తీర్పును వెలువరించింది. అడ్జస్టడ్ గ్రాస్ రెవిన్యూ (ఏజీఆర్) గా పేర్కొనే ఫీజులు చాలా వరకు పెనాల్టీల రూపంలో కంపెనీలు చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వానికి కూడా దీనిపై ఎటువంటి క్లారిటీ లేకపోవటంతో సంబంధిత కంపెనీల నుంచి ఎలాంటి బకాయిలను వసూలు చేయలేదు. అందుకే ఇప్పుడు ఒక్కసారిగా రూ లక్షల కోట్లలో బకాయిలు ఉన్నట్లు నోటీసులు జారీ చేస్తోంది.