ఎయిరిండియాను కొనేందుకు ఉద్యోగులు సిద్ధం.. కానీ అప్పటిదాకా వద్దు..
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియా విమానయాన సంస్థను గట్టెక్కించేందుకు ఆ సంస్థలో పని చేస్తోన్న ఉద్యోగులే ముందుకువచ్చారు. తామందరం కొంత వాటా వేసుకొని, ఓ ప్రయివేటు ఫైనాన్సర్తో కలిసి కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఒక్కో ఉద్యోగి రూ.1 లక్ష చొప్పున వేసుకొని బిడ్లో పాల్గొనేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే జరిగితే దేశంలోని కార్పోరేట్ సంస్థల చరిత్రలో మొదటిది కానుంది. ఇందుకు ఉద్యోగులు ఫైనాన్షియర్ను వెతుకుతున్నారని వార్తలు వచ్చాయి.
అది ఆర్బీఐ నిర్ణయం కాదు: ఆ కీలక ప్రతిపాదన నుండి శక్తికాంతదాస్ దూరం!
51 శాతం ఉద్యోగుల వాటా..
అయితే, రెండు పైలట్ యూనిట్లు మాత్రం ఈ వేలంలో పాల్గొనవద్దని ఉద్యోగుల కన్సార్టియంకు విజ్ఞప్తి చేశాయి. కమర్షియల్ డైరెక్ట్ మీనాక్షి మాలిక్ నాయకత్వంలో బిడ్డింగ్ ప్రక్రియ జరుగుతోంది. డిసెంబర్ 14వ తేదీతో ముగిసే బిడ్డింగ్ ప్రక్రియలో కంపెనీ అధికారులు పాల్గొంటారు. డిసెంబర్ 28వ తేదీలోపు అర్హత కలిగిన బిడ్డర్ల గురించి సమాచారం ఇస్తారు. ఈ ప్రణాళిక విజయవంతమైతే ఉద్యోగుల నిర్వహణ కన్సార్టియం విమానయాన సంస్థలో 51 శాతం వాటాను కలిగి ఉంటుంది. మిగతా 49 శాతం వాటాను ఫైనాన్షియర్స్ కలిగి ఉంటారు.
అప్పటి దాకా వద్దు
51 శాతం వాటాను దక్కించుకోవడానికి ఉద్యోగులు డాక్యుమెంట్స్ సమర్పించాలని, ఒక్కో ఉద్యోగి రూ.1 లక్ష కాంట్రిబ్యూట్ చేయాలి. అయితే 25 శాతం ఎర్రీర్స్ను యాజమాన్యం పరిష్కరించే వరకు దీనికి అంగీకరించవద్దని ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ (IPCA), ఇండియన్ పైలట్స్ గిల్డ్ (IPG) ఉద్యోగుల సంఘానికి జాయింట్ సర్క్యులర్లో సూచన చేసింది. పే-కట్ పరిష్కారమయ్యే వరకు ఈ ప్రక్రియలో పాల్గొనవద్దని తెలిపింది.
రెండేళ్లలో పట్టాలు..
రూ.69 వేలకోట్లకు పైగా అప్పుల్లో చిక్కుకున్న ఎయిరిండియాకు త్వరలో ఉపశమనం లభించే అవకాశాలున్నాయి. సీనియర్ ఉద్యోగుల బృందం తమ సొంత సంస్థను కొనేందుకు ముందుకొచ్చింది. ప్రయివేట్ ఈక్విటీ సంస్థతో పాటు ప్రభుత్వ బిడ్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. దీపావళి తర్వాత సమావేశమైన పలువురు సీనియర్ ఉద్యోగులు... సంస్థను తామే కొనుగోలు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారు. అందరూ ఏకగ్రీవంగా ఆమోదించి మిగతా ఉద్యోగులకు విషయం తెలిపి, మద్దతు కోరారు. ఓ ప్రయివేటు ఈక్విటీ సంస్థ వీరి ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. దాదాపు 200 మంది ఉద్యోగులు జత అయ్యారు. సంస్థలో పని చేస్తున్న మొత్తం 14 వేలమంది ఉద్యోగులందరూ రూ.1 లక్ష చొప్పున ఇస్తే కొనుగోలు చేయవచ్చు. అన్నీ సక్రమంగా జరిగితే రెండేళ్లలో సంస్థను ట్రాక్లోకి తీసుకు రావొచ్చునని భావిస్తున్నారు.