దేశంలో మళ్లీ లాక్డౌన్ ఉంటుందా? ఆర్బీఐ గవర్నర్ ఏమన్నారంటే
ముంబై: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నప్పటికీ దేశవ్యాప్త లాక్ డౌన్ మళ్లీ ఉంటుందని భావించాల్సిన అవసరం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంతదాస్ గురువారం అన్నారు. ఒక మీడియా గ్రూప్ ఏర్పాటు చేసిన ఎకనమిక్ సదస్సును ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కరోనా కేసులు పెరగడం, బిట్ కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీ, బ్యాంకింగ్ రంగ సంస్కరణలు సహా వివిధ అంశాలపై మాట్లాడారు. రానున్న పదేళ్లలో విభిన్న బ్యాంకింగ్ రంగాలను చూడబోతున్నామన్నారు.
మళ్లీ లాక్ డౌన్ ఉండదు
కరోనా కేసులు మళ్లీ పెరగడం ఆందోళనకరమైన అంశమేనని, అయితే తిరిగి లాక్డౌన్ విధించే అవకాశాలు లేవని, ప్రస్తుత రికవరీ కొనసాగనుందని శక్తికాంతదాస్ అన్నారు. రికవరీ కొనసాగుతున్నందున వృద్ధి అంచనాలను తగ్గించుకోవాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 10.5 శాతానికి చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ భయాలు పెరిగిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
18 నెలల దిగుమతులకు సరిపడా
ద్రవ్యోల్బణ అంచనాలను వచ్చే నెలలో జరిగే ద్రవ్య పరపతి విధాన కమిటీ వెల్లడిస్తుందని చెప్పారు. ఫారెక్స్ నిల్వలు 18 నెలల దిగుమతులకు సరిపడా ఉన్నాయన్నారు. ఫారెక్స్ మార్కెట్లో తీవ్ర ఊగిసలాట మంచిది కాదని అభిప్రాయపడ్డారు. అమెరికా వంటి దేశాలు భవిష్యత్తులో ఉద్దీపన చర్యలను ఉపసంహరించుకున్నప్పుడు ఎదురయ్యే ప్రతికూల ప్రభావం తట్టుకునేందుకు విదేశీ మారక నిల్వలను పెంచుకుంటున్నామన్నారు. 18 నెలల దిగుమతులకు సరిపడా విదేశీ మారక నిల్వలున్నాయని, వీటి సమీకరణకు నిర్దిష్టస్థాయిని నిర్దేశించుకోలేదన్నారు. రూపాయి స్థిరత్వం ముఖ్యమని చెప్పారు.
బాండ్స్ పైన
ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారీ రుణ సమీకరణ ప్రణాళిక బాండ్ ఈల్డ్స్ పెరుగుదలకు ప్రధాన కారణమన్నారు. దీంతో 2020-21 ఆర్థిక సంవత్సరం చివరిసారి రూ.20,000 కోట్ల బెంచ్ మార్క్ బాండ్ వేలాన్ని ఈ నెల 22న కేంద్రం రద్దు చేసిందని, ఆర్బీఐ-బాండ్ మార్కెట్ మధ్య ఎలాంటి ఘర్షణాత్మక పరిస్థితి లేదన్నారు. అయితే బాండ్స్ వడ్డీ రేట్లు ఒక్కసారిగా పెరగడం కాకుండా, కాలక్రమ పరిణామాన్ని మాత్రమే ఆర్బీఐ కోరుకుంటోందన్నారు.
భిన్నమైన బ్యాంకులు
వచ్చే దశాబ్ద కాలంలో నాలుగు రకాల బ్యాంకులను మాత్రమే చూడవచ్చునని శక్తికాంతదాస్ అన్నారు. అవి కూడా పోటీతత్వంతో, సమర్థంగా పని చేస్తాయన్నారు. దేశం, ప్రపంచవ్యాప్తంగా పెద్ద బ్యాంకులు, ఆర్థికవ్యవస్థలో మధ్య స్థాయి బ్యాంకులు, చిన్న రుణ గ్రహీతలు, డిజిటల్ సంస్థల కోసం చిన్న రుణ బ్యాంకులు/ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు/సహకార సంస్థలు ఉంటాయన్నారు. ప్రస్తుతం 10 చిన్న రుణ బ్యాంకులు, 6 పేమెంట్స్ బ్యాంకులు మనుగడలో ఉన్నాయన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రయివేటీకరణ ప్రతిపాదనకు సంబంధించి ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య సంప్రదింపులు సాగుతున్నాయన్నారు. ఈ ప్రక్రియ ఇంకా ముందుకు సాగాల్సి ఉందన్నారు.