ఇండియాలో సంపన్న సీఈఓ ఎవరో తెలుసా? ఆయన సంపద చూస్తే దిమ్మ తిరగాల్సిందే!
సీఈఓ...చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఒక కంపెనీని నడిపించే కార్పొరేట్ నాయకుడు. చాలా కంపెనీలకు వ్యవస్థాపకులు (ఫౌండర్స్) సీఈఓ లుగా కూడా వ్యవహరిస్తారు. కానీ ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ వరల్డ్ లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. కంపెనీలనీ ప్రొఫెషనల్ గా నడిపించే నాయకుల కోసం వ్యవస్థాపకులు గాలిస్తున్నారు. తమ మనసును అర్థం చేసుకుని, కంపెనీని సరిగ్గా తామైతే ఎలా అభివృద్ధి పథంలో నడపాలనుకుంటామో, అలాగే దానిని ముందుకు తీసుకెళ్లే సీఈఓ లకు రూ కోట్ల లో వేతనాలు ఆఫర్ చేస్తున్నారు.
కేవలం వేతనంతో సరిపెట్టకుండా... కంపెనీ లాభాల్లో వాటాను అందించటంతో పాటు కంపెనీలో షేర్ల ను కూడా కేటాయిస్తున్నారు. దీంతో నిబద్ధతతో సదరు సీఈఓ దానిని అఖండ విజయాల దిశగా తీసుకువెళ్తారని కంపెనీ యజమానులు ఆలోచన. అది చాలా సందర్భాల్లో నిజం కూడా. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ను నడిపిస్తున్న మన తెలుగోడు సత్య నాదెళ్ల తో పాటు గూగుల్ ను నడిపిస్తున్నతమిళ తంబీ సుందర్ పిచాయ్ వరకు ఇది నిరూపితమైంది. అయితే, ఇండియా విషయానికి వస్తే ... ఇప్పుడిప్పుడే పరిణతి కనిపిస్తోంది.
త్వరపడాల్సిందేనా?: టీవీ, ఫోన్, ఏసీ, ఫ్రిజ్.. త్వరలో పెరగనున్న ధరలు!
డీ మార్ట్ సీఈఓ... ఇండియా లో టాప్...
చిల్లర సరుకులు (గ్రోసరీస్) విక్రయించే చైన్ డీ మార్ట్ (అవెన్యూ సూపర్ మార్ట్స్) కు సీఈఓ గా వ్యవహరిస్తున్న నవిల్ నరోనా ఇండియా లో అత్యంత అధిక సంపన్న సీఈఓ గా రికార్డులకెక్కారు. ప్రస్తుతం ఇండియా లో పెద్ద పెద్ద కంపెనీలను నడిపిస్తున్న సీఈఓ ల నెట్ వర్త్ (నికర ఆస్తుల విలువ) ఆధారంగా చూస్తే నరోనా అందరికంటే ముందు ఉన్నాయి. అయన నెట్ వర్త్ ప్రస్తుతం అక్షరాలా రూ 3,128 కోట్లు కావటం విశేషం. ఇది కూడా అయన వేతనం కాకుండానే. కేవలం డీ మార్ట్ కంపెనీలో ఆయనకున్న షేర్ల విలువ పరంగా చూస్తేనే నరోనా సంపద దేశంలోనే సీఈఓ ల అందరి సంపదకంటే అత్యధికం. ఆయనకు డీ మార్ట్ లో 1,33,88,561 షేర్లు ఉన్నాయి. సంపద పరంగా చూస్తే ఆయనకు సమీపంలో కూడా ఎవరూ లేకపోవటం గమనార్హం.
ఐఐటీ .. ఐఐఎం కాకున్నా...
సాదరంగా పెద్ద పెద్ద కంపెనీలను నడిపించే లీడర్స్ ను ఐఐటీ, ఐఐఎం ల నుంచే ఎంపిక చేసుకుంటారు. అంటే గతంలో అక్కడ చదివిన వారిని పై హోదాలకు ఎంపిక చేసేందుకు ఆసక్తి చూపుతారు. లేదా టెక్నాలజీ పరంగా తోపు అయి ఉంటే కూడా ప్రాధాన్యత ఇస్తారు. కానీ నవిల్ నరోనా విషయంలో ఇవేమీ లేకపోవటం మరో విశేషం. అయినప్పటికీ అయన డీ మార్ట్ కంపెనీని దేశంలోనే అత్యధిక లాభదాయకత ఉన్న రిటైల్ చైన్ గా తీర్చిదిద్దారు. అందుకే స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీ షేర్ల కు ఇన్వెస్టర్ల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ వస్తోంది. తద్వారా డీ మార్ట్ ప్రమోటర్ రాధాకృష్ణ దమని ఇండియా లో రెండో సంపన్న వ్యక్తిగా ఎదిగారు. 17.8 బిలియన్ డాలర్ల సంపదతో అయన ముకేశ్ అంబానీ తర్వాతి స్థానంలో నిలిచారు.
రెండో స్థానంలో ఆదిత్య పూరి...
దేశంలో సంపన్న సీఈఓ ల జాబితాలో నవిల్ నరోనా మొదటి స్థానంలో ఉండగా... హెచ్ డీ ఎఫ్ సి బ్యాంకు సీఈఓ ఆదిత్య పూరి రెండో స్థానంలో ఉన్నారు. అయన నెట్ వర్త్ రూ 943 కోట్లు గా ఉంది. పూరి కి బ్యాంకులో 77,45,088 షేర్లు ఉన్నాయి. ఇక మూడో స్థానంలో కూడా డీ మార్ట్ కె చెందిన రమాకాంత్ బహేటి నిలిచారు. 28,55,339 షేర్ల తో రూ 666 కోట్ల నెట్ వర్త్ కలిగి ఉన్నారు. రూ 594 కోట్ల నెట్ వర్త్ తో టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నాని నాలుగో స్థానంలో నిలిచారు. హెచ్ డీ ఎఫ్ సి బ్యాంకు చెందిన రేణు సూద్ కర్నాడ్ రూ 547 కోట్లు, హెచ్ డీ ఎఫ్ సి ఏ ఎం సి కి చెందిన మిలింద్ బర్వె రూ 337 కోట్లు, హెచ్ డీ ఎఫ్ సి చైర్మన్ దీపక్ పరేఖ్ కు రూ 273 కోట్లు, కైజాద్ బరుచా కు రూ 256 కోట్లు, కోటక్ మహీంద్రా బ్యాంకు కు చెందిన శాంతి ఏకాంబరం కు రూ 251 కోట్లు, అదే బ్యాంకుకు చెందిన ముకుంద్ భట్ కు రూ 223 కోట్లు, అదే బ్యాంకు మరో అధికారి దీపక్ గుప్తా కు రూ 192 కోట్లు, హెచ్ డీ ఎఫ్ సి కి చెందిన కేకే మిస్త్రీ కి రూ 154 కోట్ల నెట్ వర్త్ ఉన్నట్లు ఈటీ వెల్లడించింది.