అంత డబ్బుంటే గోవాలోని ఆ భూమి మీదే: అమ్మకానికి DLFనిరర్థక ఆస్తులు
గోవా: భారత్లోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్ఎఫ్ వృథాగా ఉన్న లేదా నిరర్థక ఆస్తులను అమ్మాలనే నిర్ణయానికి వచ్చేసింది. ఇందులో భాగంగానే గోవాలో ఆ సంస్థకు ఉన్న భూముల్లో ఒక భాగంను విక్రయించాలని భావిస్తోంది. ఈ భూమి ధర రూ.250 కోట్లుగా నిర్ణయించింది. నిరర్థక ఆస్తులను ఉపసంహరించుకుని దాని ద్వారా వచ్చే డబ్బులతో తన రుణాలను లేదా అప్పులను తీర్చుకోవాలని డిసైడ్ అయ్యింది.
అమ్మకానికి డీఎల్ ఎఫ్ భూమి
తమ వద్ద ఉన్న నాలుగు నిరర్థక ఆస్తుల జాబితాలో ప్రస్తుతం ఉన్న భూమి చివరిదని డీఎల్ఎఫ్ సంస్థ ప్రతినిధి చెప్పారు. తమ వ్యాపార ప్రణాళిక మేరకు గోవా రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలని భావిస్తున్నట్లు ఆ ప్రతినిధి వెల్లడించారు. అయితే ఆ భూమిని ఎవరికి అమ్ముతుందో లేదా కొనుగోలు దారుడి పేరును మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం అమ్మాలనుకుంటున్న భూమిని డీఎల్ఎఫ్ సంస్థ పదేళ్ల క్రితం కొనుగోలు చేసింది. అక్కడ హోటల్ నిర్మాణం చేపట్టాలని భావించినప్పటికీ అ ఆలోచన కార్యరూపం దాల్చలేదు.
కొన్ని అడ్డంకులతో నిలిచిపోయిన నిర్మాణాలు
గోవాలో మూడు భూములు డీఎల్ఎఫ్ సంస్థ వద్ద ఉన్నాయి. 2000 వ సంవత్సరం ద్వితీయార్థంలో ఆ భూములను కొనుగోలు చేసింది. అక్కడ నివాస గృహాలు, రీటెయిల్ సంస్థలు, హోటల్ ప్రాజెక్టులు నిర్మించాలని భావించింది. అయితే డీఎల్ఎఫ్ సంస్థకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సులు రాకపోవడం ముఖ్యమైన అడ్డంకిగా మారింది. ఇక్కడ ఆ ప్రాంతాన్ని మరింత వృద్ధి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. 2012 నుంచి డీఎల్ఎఫ్ సంస్థ క్రమంగా తన హాస్పిటాలిటీ వెంచర్లను విక్రయిస్తూ వస్తోంది. ఇలా విక్రయించగా వచ్చిన డబ్బులతో తీసుకున్న అప్పులను చెల్లిస్తూ వస్తోంది.
అమ్మకం ఆస్తులు అమ్మి అప్పులు కట్టి..
ఈ ఆర్థికపరమైన అడ్డంకులను తొలగించుకుని తన ప్రధాన లక్ష్యంగా ఉన్న గృహనిర్మాణాలపై దృష్టి సారించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే చాలా వరకు ఆస్తులను అమ్మివేసి గురుగ్రామ్ చెన్నైలాంటి నగరాల్లో తమ వ్యాపార విస్తరణపై దృష్టి సారించింది. హాస్పిటాలిటీ విభాగంలో డీఎల్ఎఫ్ సంస్థ అమన్ రిసార్ట్స్ను అమన్ రిసార్ట్స్ గ్రూప్ లిమిటెడ్నకు 358 మిలియన్ డాలర్లకు విక్రయించింది. అడోన్ హోటల్స్ మరియు హాస్పిటాలిటీలో తన వాటాను ఉపసంహరించుకుని కోల్కతాలోని అవని ప్రాజెక్ట్స్ అండ్ స్కవేర్ ఫోర్ హౌజింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రూ.567 కోట్లకు 2012 జూన్లో విక్రయించింది డీఎల్ ఎఫ్.
డిసెంబర్ త్రైమాసికంలో రూ.5215 కోట్లుగా ఉన్న అప్పును డీఎల్ఎఫ్ సంస్థ కొంతమేరా చెల్లించి రూ.5100 కోట్లకు చేర్చింది. ఇక కోవిడ్ సమయంలో చాలా నష్టాలను చవి చూసిన డీఎల్ఎఫ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తాము చేపడుతున్న గృహాల నిర్మాణం ప్రారంభం అయ్యాక అమ్మకానికి పెడుతామని ప్రకటించింది.