COVID 19: మీ బ్యాంక్ ఖాతాల్లో నగదు జమకాలేదా? నేరుగా మీ చేతికి నగదు
హైదరాబాద్: కరోనా మహమ్మారి లాక్ డౌన్ కారణంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెల్ల రేషన్ కార్డు కలిగిన వారి అకౌంట్లలో డబ్బులు వేస్తోన్న విషయం తెలిసిందే. పలువురి అకౌంట్లలో ఇప్పటికే డబ్బులు జమ అయ్యాయి. అయితే బ్యాంకు ఖాతాలతో ఆధార్ కార్డు లింక్ లేని వారి ఖాతాల్లో జమ కాలేదు. దీనిపై పౌరసరఫరాల సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి స్పందించారు.
ఏప్రిల్ 15 రోజుల్లో 50% తగ్గిన చమురు డిమాండ్, పెరిగిన సిలిండర్ సేల్స్
బ్యాంకు ఖాతా-ఆధార్ లింక్ లేని వారికి నేరుగా నగదు
తెలంగాణలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఆర్థిక సహాయం అందిస్తామని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. బ్యాంకు ఖాతాలతో ఆధార్ కార్డు లింక్ లేని వారి ఖాతాల్లో నగదు జమ కాలేదని, అలాంటి వారికి నేరుగా నగదు అందిస్తామని చెప్పారు. 5 లక్షల 21 వేల 640 కార్డుదారులకు నగదును బ్యాంకుల్లో వేయలేకపోయామన్నారు. వారందరికీ నేరుగా లేదా తపాలా ద్వారా లబ్ధిదారులకు నగదు అందిస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెల్ల రేషన్ కార్డుదారులకు రూ.500, రూ.1,500, జమ చేస్తోన్న విషయం తెలిసిందే.
అలాంటి వదంతులు నమ్మవద్దు
వలస కార్మికులకు 12 కిలోల చొప్పున ప్రతి ఒక్కరికి బియ్యం, కుటుంబానికి రూ.500 అందించామని చెప్పారు. బ్యాంకులో క్రెడిట్ అయిన నగదు తీసుకోకుంటే వెనక్కు వెళ్లిపోతుందనే వదంతులు నమ్మవద్దని చెప్పారు. ఆ నగదును ఎప్పుడైనా తీసుకోవచ్చునని చెప్పారు. బ్యాంకుల వద్ద జనం గుమికూడకుండా భౌతిక దూరం పాటించి నగదు తీసుకోవాలని సూచించారు.
పోస్టుమాస్టర్ జనరల్ ఖాతాకు జమ
లాక్ డౌన్ నేపథ్యంలో మొత్తం 87.54 లక్షల మంది రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యం, ప్యామిలీకి రూ.1,500 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. 91 శాతం మంది బియ్యం తీసుకున్నారు. ఇప్పటికే 74,07,186 మందికి నగదు బదిలీ చేశామని, మిగిలిన 5.21 లక్షల మందికి బ్యాంకు ఖాతాలు లేవని గుర్తించామని, వారికి పోస్టాఫీస్ ద్వారా నగదు బదిలీ చేసేందుకు రూ.78.25 కోట్లను పోస్టుమాస్టర్ జనరల్ ఖాతాకు శనివారం జమ చేసినట్లు తెలిపారు. పేదవారికి అందరికి ప్రభుత్వం ప్రకటించిన సొమ్ము అందిస్తామన్నారు.