DigiYatra: సులభతరంగా విమాన ప్రయాణం.. అందుబాటులోకి నయా టెక్నాలజీ.. హైదరాబాద్..
కేంద్రం కొత్తగా అందుబాటులోకి తెచ్చిన డిజీ యాత్ర కార్యక్రమంలో భాగంగా.. హైదరాబాద్ విమానాశ్రయం ఆగస్టు 18 నుంచి డిజిటల్ ప్రాసెసింగ్ ధృవీకరణ ప్రకియను అందుబాటులోకి తెచ్చింది. దీని వల్ల ప్రయాణికుల సమయం వృధా తగ్గటమే కాక, ప్రక్రియ సులభతరం కానుందని తెలుస్తోంది.
ఆటోమేటిక్ ప్రక్రియ ..
డిజీయాత్రతో విమాన ప్రయాణికులు డిపార్చర్ డొమెస్టిక్ ఎంట్రీ గేట్- 3, ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్లోని సెక్యూరిటీ హోల్డ్ ఏరియా (SHA)తో సహా ఎంపిక చేసిన చెక్పోస్టుల వద్ద ప్రయాణీకులు ఆటోమేటిక్గా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ఆధారంగా ప్రాసెస్ చేయబడతారు.
ప్రత్యేక యాప్..
DigiYatra టెక్నికల్ బృందం నమోదు కోసం ప్రత్యేకమైన మొబైల్ యాప్ను అభివృద్ధి చేసింది. డిజియాత్ర ప్రోగ్రామ్ అందించే సేవలను పొందేందుకు నిమాన ప్రయాణికులు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ను ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన బీటా వెర్షన్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉంది.
ఉపయోగాలు ఇవే..
డిజీయాత్ర చొరవ విమానయాన ప్రయాణికులకు, వేగవంతమైన, అవాంతరాలు లేని, డిజిటల్గా ఏకీకృత విమాన ప్రయాణ అనుభవాన్ని ప్రయాణంలోని అన్ని దశల్లో అందిస్తుంది. ఇది భారతీయ విమానయాన చరిత్రలో ఒక మైలురాయి అని చెప్పుకోవాలి. ఈ సాంకేతికత ప్రయాణికులు కాగిత రహిత ప్రయాణాన్ని అనుమతిస్తుంది. విమాన ప్రయాణికులకు బోర్డింగ్ పాస్గా ఫేస్ స్కాన్ ఉపయోగపడుతుంది. రియల్ టైమ్ బయోమెట్రిక్స్తో "డిజియాత్ర ఐడీ"ని ఉపయోగించి భారతీయ విమానాశ్రయాల్లో మెరుగైన భద్రత ఉపయోగించబడుతుంది. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్ నేషనల్ విమానాశ్రయంలో ప్రస్తుతం ఈ నూతన సాంకేతికత అందుబాటులో ఉంది.