Yes Bank crisis: కూతుళ్ల కంపెనీకి రూ.600 కోట్ల ముడుపులు, సీబీఐ ఎఫ్ఐఆర్లో భార్య, కూతుళ్లు
ముంబై: యస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రానాకపూర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కేంద్ర దర్యాఫ్తు సంస్థ (CBI) ఈ మేరకు ముంబైలోని ఏడు ప్రాంతాల్లో సోమవారం సోదాలు నిర్వహించింది. DHFLకు ఇచ్చిన రుణాలకు ప్రతిఫలంగా రానా కపూర్ కుటుంబానికి రూ.600 కోట్ల ముడుపులు అందాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహించారు. రానా కపూర్ అధికారిక నివాసంతో పాటు ఆయనకు సంబంధం ఉన్న మరిన్ని ప్రాంతాల్లోను సోదాలు జరిగాయి. ఇప్పటికే రానా మనీలాండరింగ్ కింద ఈడీ కస్టడీలో ఉన్నాడు.
యస్ బ్యాంకు సంక్షోభం, మరిన్ని కథనాలు
సీబీఐ ఎఫ్ఐఆర్
నేరపూరిత కుట్ర, మోసం, అవినీతి వంటి ఆరోపణలపై రానా కపూర్ DHFL ప్రమోటర్, డైరెక్టర్ కపిల్ వద్వాన్, డూఇట్ అర్బన్ వెంచర్స్పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. DHFLకు ఆర్థిక సాయం విషయంలో వధ్వాన్తో కలిసి రానాకపూర్ కుట్ర పన్నారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. బ్యాంకు నుండి అందే రుణానికి ప్రతిఫలంగా తనకు, తన కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీల ద్వారా లబ్ధి చేర్చాలని ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు.
కుట్రకోణం...
2018 ఏప్రిల్, జూన్ మధ్య ఈ కుట్రకోణం రూపుదిద్దుకున్నదని పేర్కొన్నారు. అదే సమయంలో DHFL స్వల్పకాలిక డిబెంచర్లో రూ.3700 కోట్లు యస్ బ్యాంకు పెట్టుబడి పెట్టినట్లు చెప్పారు. దీనికి ప్రతిఫలంగా వధ్వాన్కు చెందిన డూఇట్ అర్బన్ వెంచర్స్ అనే సంస్థకు రుణాల రూపంలో రూ.600 కోట్లు అందించారు. ఈ కంపెనీని ఆయన కూతుళ్లు రోషిణి, రాధా, రాఖీలు నిర్వహిస్తున్నారు.
రానా భార్య, కూతుళ్ల పేర్లు కూడా..
ఇంగ్లీష్ మీడియాలో వస్తున్న సమాచారం మేరకు యస్ బ్యాంకు కేసులో సీబీఐ రానాకపూర్తో పాటు ఆయన భార్య బిందూ కపూర్, కూతుళ్లు రాధా, రోషిణి, రాఖీ పేర్లను ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పోరేషన్ (DHFL) ప్రమోటర్లతో పాటు ముంబైకి చెందిన మరో ఐదు కంపెనీలను పేర్కొన్నాయి.