పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గొచ్చు: ధర్మేంద్ర ప్రధాన్ శుభవార్త, వివిధ నగరాల్లో ధరలు..
గత కొద్దికాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు క్షీణించడంతో ఇక్కడ కూడా ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. దీనికి తోడు వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రభావం కూడా కనిపించింది. గత నెలలో చివరి పదిహేను రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మూడుమార్లు క్షీణించాయి. ధరలు వరుసగా ఐదో రోజు స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా కరోనా కేసులు పెరగడం, ఒపెక్ సహా వివిధ దేశాలు ఉత్పత్తి పెంచడం వంటి కారణాలతో ధరలు తగ్గాయి.
ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారంటే
పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రమంత్రులు పలువురు పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు అంతర్జాతీయ మార్కెట్ కారణమని గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ధరలు పెరుగుతున్నాయని, తగ్గించడమే పరిష్కారమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా వ్యాఖ్యానించారు. తాజాగా ధర్మేంద్ర ప్రధాన్ మరోసారి పెట్రో, డీజిల్ ధరల పెరుగుదలపై స్పందించారు. చమురు ధరలు రానున్న రోజుల్లో కాస్త తగ్గవచ్చునని ప్రధాన్ అన్నారు. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్ సానుకూలత సాధిస్తోందని అంటున్నారు.
మరింత తగ్గవచ్చు
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని, రానున్న రోజుల్లో మరింత తగ్గవచ్చునని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ తగ్గుదల ప్రయోజనాన్ని కస్టమర్లకు అందిస్తామని గతంలోనే చెప్పామని ధర్మేంద్ర ప్రధాన్ గుర్తు చేశారు. అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా ఇక్కడ ధరలు పెరుగుతున్నాయని గతంలో చెప్పారు.
వివిధ నగరాల్లో ధరలు
వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.90.56, డీజిల్ రూ.80.87, ముంబైలో పెట్రోల్ రూ.96.98, డీజిల్ రూ.87.96, చెన్నైలో పెట్రోల్ రూ.92.58, డీజిల్ రూ.85.88, కోల్కతాలో పెట్రోల్ రూ.90.77, డీజిల్ రూ.83.75గా ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు చివరిసారి మార్చి 30న పెరిగాయి. పెట్రోల్ పైన 22 పైసలు, డీజిల్ పైన 23 పైసలు పెరిగింది.