పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే? కాంగ్రెస్ను లాగిన ధర్మేంద్ర
పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం మరోసారి స్పందించారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయని, ఈ ప్రభావం దేశీయంగా ఇంధన ధరలపై పడిందని తెలిపారు. దీంతో పాటు గత కాంగ్రెస్ పాలన కూడా ధరల పెరుగుదలకు కారణమని అభిప్రాయపడ్డారు. ఇటీవల పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహన వినియోగదారులకు చుక్కలు చూపిస్తోన్న విషయం తెలిసిందే. దీంతో ధరలు తగ్గించాలని ప్రతిపక్షాలతో పాటు వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇంధన ధరల పెరుగుదలకు కారణాలు వెల్లడించారు ధర్మేంద్ర ప్రధాన్. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదల వల్ల ఇంధన ధరలు పెరుగుతున్నాయని తెలిపారు. మనం ఉపయోగించే చమురులో 80 శాతం దిగుమతి చేసుకోవడం ద్వారానే వస్తోందని చెప్పారు. అదే సమయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వంపై ఆయన మాటల దాడి చేశారు.
యూపీఏ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల అప్పులు చేసిందని, రీపేమెంట్ కోసం పెద్ద ఎత్తున చమురు బాండ్లను వదిలివేసిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వడ్డీతో పాటు మొత్తం చెల్లించవలసి వచ్చిందన్నారు. ఇది కూడా పెట్రోల్ ధరల పెరుగుదలకు కారణమని చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చే అంశంపై నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిల్ తీసుకుంటుందని చెప్పారు.