మందగమనంలోనూ ఆంధ్రప్రదేశ్ ఆదాయం సూపర్: భారీగా తగ్గిన లిక్కర్ ఆదాయం
అమరావతి: ప్రపంచవ్యాప్తంగా, దేశంలోనూ ఆర్థిక మందగమనం పరిస్థితులు ఉన్నప్పటికీ ఆదాయంపరంగా ఆంధ్రప్రదేశ్ నిలదొక్కుకుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఆదాయ వనరుల ఆర్జనపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుంటుండటం సానుకూల పరిణామం అన్నారు. మద్యం దుకాణాల వల్ల లైసెన్స్ ఫీజును కోల్పోయినప్పటికీ దీనిని నియంత్రించాల్సి ఉందని చెప్పారు.
గత ఏడాది కంటే తగ్గిన ఆదాయం
శాఖలవారీగా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం, ప్రస్తుత పరిస్థితులపై జగన్.. అధికారులతో చర్చించారు. అన్ని శాఖలకు కలిపి కమర్షియల్ ట్యాక్స్, ల్యాండ్ రిజిస్ట్రేషన్ వంటి వాటి ద్వారా... గత ఏడాది అక్టోబర్ నెల వరకు రూ.35,411.23 కోట్ల మేర ఆదాయం రాగా, ఈ ఏడాది రూ.34,669.96 కోట్లు వచ్చింది. మొత్తం మీద ఆదాయం 2.10 శాతం తగ్గింది. రవాణా శాఖ ఆదాయం తొలి రెండు త్రైమాసికాల్లో తగ్గింది. అక్టోబర్ నెలలో మాత్రం పెరిగింది.
తగ్గిన రవాణా ఆదాయం
రవాణా శాఖ ఆదాయం తొలి, రెండో త్రైమాసికాల్లో వరుసగా 11.81 శాతం, 12.42 శాతం తగ్గింది. అక్టోబర్ నెలలో మాత్రం 15.4 శాతం మేర పెరిగింది. రవాణా ఆదాయం మొత్తంగా 6.83 శాతం తగ్గింది. ట్రాన్సుపోర్ట్ ఆదాయం గత ఏడాది రూ.2,116 కోట్లు కాగా ఈ ఏడాది రూ.1,972 కోట్లుగా ఉంది.
పెరిగిన కమర్షియల్ ట్యాక్స్ ఆదాయం
2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో గత అక్టోబర్ నాటికి కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్టుమెంట్ ఆదాయం 0.14 శాతం పెరిగింది. గత ఏడాది రూ.24,947 కోట్లు కాగా, ఈ ఏడాది రూ.24,982 కోట్ల ఆదాయం వచ్చింది.
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్టుమెంట్ ఆదాయం 3.26 శాతం పెరిగింది. గత ఏడాది అక్టోబర్ నాటికి ఆదాయం రూ.2,804 కోట్లు కాగా, ఈ ఏడాది రూ.2,896 కోట్లుగా ఉంది.
తగ్గిన మైనింగ్ ఆదాయం
మైనింగ్ ఆదాయం 19 శాతం పడిపోయంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ నాటికి గనుల ద్వారా ఆదాయం రూ.1,258 కోట్లు కాగా, ఈ ఏడాది రూ.1,023 కోట్లుగా ఉంది.
భారీగా తగ్గిన ఎక్సైజ్ ఆదాయం
ఇక, అటవీ ఆదాయం 78.03 శాతం తగ్గింది. గత ఏడాది రూ.131.69 కోట్లు కాగా, ఈ ఏడాది రూ.28.94 కోట్లుగా ఉంది. ల్యాండ్ రెవెన్యూ ఆదాయం 23 శాతం తగ్గింది. ఇది గత ఏడాది రూ.109 కోట్లు కాగా, ఈ ఏడాది 84 కోట్లుగా ఉంది. ఎక్సైజ్ ఆదాయం గత ఏడాది 4,043 కోట్లు కాగా, ఈ ఏడాది 3,683 కోట్లకు తగ్గింది. తగ్గుదల 8.91 శాతంగా ఉంది. మొత్తంగా గత ఏడాది అక్టోబర్ నాటికి ఆదాయం రూ.35,411.23 కోట్లుగా ఉంటే, ఈ ఏడాదిలో 2.10 శాతం తగ్గి రూ.34,669.35గా ఉంది.
బార్ల సంఖ్య, సమయం కుదింపు!
ఇదిలా ఉండగా, ఏపీలో ప్రస్తుతం ఉన్న బార్ల సంఖ్యను సగానికి తగ్గించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 1, 2020 నుంచి వీటిని అమలు చేయనున్నారు. అలాగే, బార్ల సమయాన్ని ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పరిమితం చేయనున్నారు. ప్రస్తుతం ఏపీలో 819 బార్లు ఉండగా, వాటిని 400కు కుదించనున్నారు. 2017లో కొత్త బార్లకు అయిదేళ్ల కాలానికి గాను అనుమతులు ఇచ్చారు. వీటి నిర్వహణకు 2022 వరకు గడువు ఉంది. అయితే ఎక్సైజ్ చట్టంలోని కొన్ని నిబంధనలు అనుసరించి ప్రస్తుతం అమలులో ఉన్న బార్ల విధానం రద్దు చేసి, కొత్త విధానం తీసుకు రానున్నారు.