EPF new interest rate: 40 ఏళ్ల కనిష్ఠానికి పీఎఫ్ వడ్డీ రేటు: కేంద్రం పచ్చజెండా
న్యూఢిల్లీ: పదవీ విరమణ చేసిన అనంతరం తమ భవిష్యత్ అవసరాల కోసం కోట్లాదిమంది ఉద్యోగులు డిపాజిట్ చేసుకునే చిన్న మొత్తాలపై కేంద్ర ప్రభుత్వం భారీ నిర్ణయాన్ని తీసుకుంది. ఉద్యోగుల భవిష్య నిధి వడ్డీ రేటు (EPF interest rate)ను మరోసారి కుదించింది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటును కుదిస్తూ ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టీలు పంపించిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. కేంద్రం ఆమోదం తెలపడంతో ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై ఉన్న వడ్డీ రేటు 8.1 శాతానికి తగ్గింది.
ఆ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం..
ఇంత తక్కువ మొత్తానికి ఈపీఎఫ్ వడ్డీరేటును కుదించడం.. 40 సంవత్సరాల ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈపీఎఫ్ వడ్డీ రేటును కుదిస్తూ గత ఏడాది డిసెంబర్లో ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు కీలక ప్రతిపాదనలను రూపొందించారు.
అస్సాంలోని గువాహటిలో నిర్వహించిన సమావేశంలో దీనికి తుదిరూపం ఇచ్చారు. ఈపీఎఫ్ డిపాజిట్లపై ఇదివరకు అమలులో ఉన్న వడ్డీ రేటును 8.4 నుంచి 8.1 శాతానికి కుదించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమోదించింది.
40 బేసిస్ పాయింట్లు కోత..
ఉద్యోగుల భవిష్యనిధి డిపాజిట్లపై ఇంత కనిష్ఠ స్థాయిలో వడ్డీరేటును నిర్ధారించడం- 40 సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి. 1977-78 ఆర్థిక సంవత్సరంలో ఉన్న ఈపీఎఫ్ వడ్డీ రేటు ఎనిమిది శాతం. ఇప్పుడు దాదాపు అదే స్థాయికి పడిపోయింది. 40 బేసిస్ పాయింట్లకు తగ్గించినందు వల్ల వడ్డీ రేటు 8.4 నుంచి 8.1 శాతానికి దిగజారింది. దీని ప్రభావం ఆరుకోట్ల మంది ఉద్యోగులపై పడింది. 2020 మార్చిలో చివరిసారిగా ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.4గా నిర్ధారించింది కేంద్రం. రెండేళ్లకే మళ్లీ దీన్ని 8.1కి మరింత తగ్గించింది.
ఆర్థికశాఖకు తీర్మానం..
తాజాగా ఈ ప్రతిపాదనలను నిర్మల సీతారామన్ సారథ్యంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించింది. దీన్ని ర్యాటిఫై చేసింది. ఈ సంవత్సరం మార్చి 31లో కొత్తగా మరో 15.32 లక్షల మంది ఉద్యోగులు ఈపీఎఫ్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఫిబ్రవరిలో ఈ సంఖ్య 12.85 లక్షలుగా నమోదైంది. ఫిబ్రవరితో పోల్చుకుంటే- మార్చిలో 19 శాతం మంది కొత్తగా ఈపీఎఫ్లో చేరారు.
కుదింపు ఇలా..
2015-16 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల భవిష్యనిధిపై ఉన్న వడ్డీ రేటు 8.8 శాతం. 2016-17 ఆర్థిక సంవత్సరంలో అమలులో ఉన్న వడ్డీ రేటు 8.65 శాతం. ఆ మరుసటి సంవత్సరమే అంటే 2017-18లో దీన్ని కేంద్ర ప్రభుత్వం దీన్ని 8.55 శాతానికి తగ్గించింది. అప్పటి నుంచీ ఇది ప్రతి సంవత్సరం దిగజారుతూ వస్తోంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 8.5గా నిర్ధారించింది. ఇప్పుడు మళ్లి దీన్ని తాజాగా సవరించింది. 8.1 శాతానికి కుదించింది.