మాల్స్ ,సూపర్ మార్కెట్ లకు గిరాకీ తగ్గింది అందుకేనా ? కిరాణా షాపుల క్రేజ్ కు ఇదీ ఒక కారణమా !!
కరోనా కారణంగా వినియోగదారుల వైఖరి మారుతుందా ? లేక కరోనా సమయంలో సూపర్ మార్కెట్లు, మాల్స్ వద్ద ఖచ్చితంగా అమలు చేస్తున్న నిబంధనల నేపథ్యంలో వినియోగదారుల దృష్టి కిరాణా షాపుల మీదకు మళ్ళుతుందా అన్నది ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
కిరాణా షాపులు ప్రజల విస్వతనీయత చూరగొన్నాయన్న తాజా సర్వే
కరోనా సమయంలో విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల కోసం వినియోగదారులు మాల్స్,సూపర్ మార్కెట్ లకు బదులుగా, కిరణా షాప్ లను ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. తాజాగా నిర్వహించిన ఒక సర్వే కూడా మాల్స్,సూపర్ మార్కెట్ ల కంటే కిరాణా దుకాణాలు మేలని వినియోగదారులు తేల్చారని పేర్కొంది.లాక్ డౌన్ సమయంలో కరోనా కారణంగా దగ్గరగా ఉన్న కిరాణా షాపులలో కొనుగోలు చేసిన వినియోగదారులు ,ఇక కిరణా షాప్ కే అలవాటు పడతారు అని, అంతగా కిరాణా షాపులు ప్రజల విశ్వసనీయత చూరగొన్నాయని పలువురు పేర్కొంటున్నారు.
కరోనా నేపధ్యంలో మాల్స్ ,సూపర్ మార్కెట్ ల వద్ద జాగ్రత్తలతో ఆలస్యం
అయితే కరోనా లాక్డౌన్ సమయంలో సూపర్ మార్కెట్ ల వద్ద సామాజిక దూరం పాటించడం, వినియోగదారుల వ్యక్తిగత ఆరోగ్య రక్షణ దృష్ట్యా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. క్యూలైన్లో నిలబెట్టి పది మందిని మాత్రమే మాల్స్ లోపలికి అనుమతించారు.అంతేకాదు వారి శరీర ఉష్ణోగ్రతను చూడడం, వారి చేతులు శానిటైజ్ చేయడం వంటి అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో మెగా మాల్స్ కు,సూపర్ మార్కెట్లకు వెళితే లైన్ లో నిలబడి లోపలికి వెళ్ళేసరికి గంటల సమయం పడుతుందని భావించిన వినియోగదారులు సూపర్ మార్కెట్లకు వెళ్లేందుకు అనాసక్తి చూపించారు.
కిరాణా షాపుల వద్ద ఎలాంటి క్యూలు లేకపోవటంతో కిరాణా షాపులవైపు మొగ్గు
అదే దగ్గరగా ఉన్న కిరాణా షాప్ కి వెళితే ఎలాంటి క్యూలైన్ లేకుండా త్వరగా ఇంటికి రావచ్చని భావించిన నేపథ్యంలోనే కిరణా షాప్ ల వైపు మొగ్గు చూపించారు.ఇక కరోనా వైరస్ ఇప్పట్లో వదలదని కచ్చితంగా సామాజిక దూరం పాటించాలని,మాస్కులు ధరించాలని, మాల్స్,సూపర్ మార్కెట్ల నిర్వాహకులు కచ్చితంగా నియమ నిబంధనలు పాటించాలని చెప్తున్న నేపథ్యంలో వినియోగదారుల ఆసక్తి స్థానిక కిరణం షాప్ లపై పడిందని చెప్పడం ఒక ముఖ్యమైన అంశం.
ఆధునిక కాలంలో అన్నీ వస్తువులు ఒకేచోట దొరికే సూపర్ మార్కెట్ల వైపే ప్రజల ఆసక్తి
సహజంగా ఎవరైనా కిరణా షాప్ లకంటే,మాల్స్,సూపర్ మార్కెట్ లలోనే నిత్యావసరాల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తారు.అందుకు కారణం మాల్స్,సూపర్ మార్కెట్లలో కావలసిన అన్ని వస్తువులు ఒకే చోట ఉండటం,మనకు కావాల్సిన పండ్లు,కూరగాయలు,సరుకులు అన్నీ ఒకే చోట లభిస్తాయి కాబట్టి సాధారణంగా ప్రజలు ఎవరైనా మాల్స్, సూపర్ మార్కెట్ వైపే ఆసక్తి చూపిస్తారు.నేటి కాలంలో కిరాణా షాపుల ముందు కూర్చొని సరుకులు తీసుకెళుతున్న వారు చాలా తక్కువ.
మాల్స్ లో నిబంధనలతో సమయం వృధా.. విముఖతకు ఒక కారణం ఇదే
కానీ కరోనా లాక్ డౌన్ సమయంలో జనాలకు కిరణా షాప్ లు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరుకులు అందించే వ్యవస్థలాగా కనిపించాయి.గంటలకొద్దీ సమయం వృధా కాకుండా మనకు కావలసిన సరుకులు వెంటనే తీసుకువెళ్ళవచ్చు అనే ఉద్దేశంతో కిరాణాషాపులను ఆశ్రయిస్తున్నారు అనేది ఒక వర్గం వాదన . ఇక కరోనా కారణంగా మొదలుపెట్టిన కఠిన నిబంధనలు లేకుంటే అటు మాల్స్ , సూపర్ మార్కెట్లు కూడా జోరుగానే వ్యాపారం సాగించేవని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా కరోనాకారణంగా విధించిన నిబంధనలు మాల్స్ కు, సూపర్ మార్కెట్ లకు గిరాకీ తగ్గించాయి అనేది కొందరు విశ్లేషకుల అభిప్రాయం.