Cyber Fraud: బీ అలర్ట్.. మెుబైల్ యూజర్లే టార్గెట్.. కొత్త దారి పట్టిన సైబర్ కేటుగాళ్లు..
Fraud Alert: మాయగాళ్లకు మార్గాలు కరువా అన్నట్లు తయారౌతోంది రోజురోజుకూ పరిస్థితి. తాజాగా సైబర్ నేరగాళ్లు కొత్త రకం మోసానికి పాల్పడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు అన్ని స్కీమ్స్ అమలులో ఈ- కేవైసీని అమలు చేస్తోంది. బ్యాంకులు సైతం దీనినే ఫాలో అవుతున్నాయి. దీనిని సైబర్ కేటుగాళ్లు తమ మోసాలకు అడ్డాగా మార్చుకున్నారు.
|
మెుబైల్ వినియోగదారులే టార్గెట్..
ఇలాంటి నేరాలకు పాల్పడేందుకు ప్రభుత్వ రంగానికి చెందిన టెలికాం సర్వీస్ ప్రొవైడర్ మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (MTNL) పేరు, లోగోను వినియోగించుకుంటున్నారు. ఇలాంటి కేసులు వెలుగులోకి రావటంతో ఢిల్లీ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. బోగస్ వాట్సాప్ మెసేజ్ లను పంపుతున్నట్లు గుర్తించారు. సిమ్ కార్డ్, ఆధార్ కార్డ్ ఈ- కేవైసీ పూర్తి చేయాలని కోరుతూ మెుబైల్ కస్టమర్ల నుంచి సమాచారాన్ని లాగేస్తున్నారు.
సిమ్ కార్డులు పనిచేయవంటూ..
సిమ్, ఆధార్ కార్డు లింక్ చేయటం తప్పనిసరని.. సకాలంలో పూర్తి చేయకపోతే సిమ్ కార్డులు బ్లాక్ అవుతాయంటూ సందేశాలను పంపుతున్నారు. తాము కంపెనీ అధికారిక ప్రతినిధుల మంటూ మాయమాటలు చెప్పి సమాచారాన్ని లాగేస్తున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
బీ అలర్ట్ అంటూ..
ఇలాంటి కాల్స్, మెసేజ్ లకు ఎటువంటి పరిస్థితుల్లోనూ స్పందించవద్దని పోలీసులు సూచిస్తున్నారు. MTNL WhatsApp ఉపయోగించి KYC ధృవీకరణను నిర్వహించదని గుర్తుంచుకోండి. ఇలాంటి మోసగాళ్లు పంపే లింక్స్ క్లిక్ చేయవద్దని, ఏదైనా ప్రోగ్రామ్లను డౌన్లోడ్ చేయవద్దని వారు సూచిస్తున్నారు.
సైబర్ ఎడ్యుకేషన్ లేకనే..
దేశంలో చాలా మందికి సైబర్ సెక్యూరిటీపై అవగాహన లేకనే ఇలాంటి మోసగాళ్ల మాయలో చిక్కుకుంటున్నట్లు తెలుస్తోంది. మారుతున్న కాలానికి, సాంకేతికతకు అనుగుణంగా సైబర్ సెక్యూరిటీ అంశాలపై అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం.. 2018-2021 మధ్య కాలంలో సైబర్ క్రైమ్ మోసాలు 5 రెట్లు పెరిగాయి. పోలీసు అధికారులు నిరంతరం అవగాహన పెంచుతున్నారు. సైబర్ ఆర్థిక మోసం హెల్ప్లైన్-1930కి కాల్ చేయడం ద్వారా లేదా సైబర్ క్రైమ్ వెబ్సైట్ను సందర్శించడం ద్వారా సైబర్ మోసాలపై కంప్లెయింట్ చేయవచ్చని వారు సూచిస్తున్నారు.