జూన్ 8న కరోనా వ్యాక్సీన్, వస్తువులపై ట్యాక్స్ కోత నిర్ణయం
కరోనా వ్యాక్సీన్ పైన ట్యాక్స్ కట్ నిర్ణయాన్ని జూన్ 8వ తేదీకి వాయిదా వేసింది జీఎస్టీ కౌన్సిల్. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. శుక్రవారం, మే 28వ తేదీన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో 43వ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(GST) కౌన్సిల్ భేటీ జరిగింది. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో కోవిడ్ సంబంధిత ఎసెన్సియల్స్ పైన జీఎస్టీ పన్నుకు సంబంధించి చర్చ జరుగుతుందని, దీనిపై నిర్ణయం వెలువడుతుందని భావించారు.
కానీ కరోనా ఔషధాలు, వ్యాక్సిన్స్, వైద్య పరిరకాలపై జీఎస్టీ తగ్గింపు అంశంపై జీఎస్టీ మండలిలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ఈ సమావేశం ముగిసింది. అయితే జూన్ 8వ తేదీకి నిర్ణయం వాయిదా వేసినట్లు కేంద్రం తెలిపింది.
కరోనా చికిత్సకు సంబంధించిన వ్యాక్సీన్, ఔషధాలు, పరికరాలపై విధిస్తున్న పన్ను విషయమై కౌన్సిల్ భేటీలో సుదీర్ఘంగా చర్చించామని నిర్మలా సీతారామన్ తెలిపారు. కరోనా సంబంధిత వస్తువులపై జీఎస్టీ తగ్గింపు విషయమై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ఉపసంఘం 10 రోజుల్లో నివేదిక ఇస్తుందని, వచ్చే నెల 8లోపు నివేదిక సమర్పిస్తుందన్నారు. ఉపసంఘం సభ్యులను ఖరారు చేయాల్సి ఉంది.