కరోనా కాలంలో ఫస్ట్ టైమ్ ఫేస్ టు ఫేస్: దావోస్ సదస్సు కొత్త షెడ్యూల్ ఇదే
బెర్న్: స్విట్జర్లాండ్లోని దావోస్లో నిర్వహించబోయే ప్రపంచ ఆర్థిక సదస్సు కొత్త షెడ్యూల్ వెల్లడైంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత తొలిసారిగా ముఖాముఖిగా ఈ అత్యున్నత సమ్మిట్ ఏర్పాటు కానుంది. వర్కింగ్ టుగెదర్, రీస్టోరింగ్ ట్రస్ట్ అనేది దీని థీమ్. గత ఏడాది డిసెంబర్లో ఇన్-పర్సన్ సమ్మిట్ను నిర్వహించాలని భావించినప్పటికీ- ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందడం ఆరంభం కావడంతో అది సాధ్యపడలేదు. దీనితో నిర్వాహకులు దీన్ని వాయిదా వేశారు.
ఇప్పుడు తాజాగా దీన్ని ఈ సంవత్సరం మేలో షెడ్యూల్ చేశారు. 22 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్నామని ప్రపంచ ఆర్థిక వేదిక వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ క్లాజ్ ష్క్వాబ్ తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి మిగిల్చిన సంక్షోభం నుంచి ప్రపంచ దేశాలు కోలుకోవడం, వాతావరణంలో మార్పులు, మెరుగైన భవిష్యత్ ప్రణాళికలు, పెట్టుబడులను మరింత వేగవంతం చేసేలా కార్యాచరణను రూపొందించుకోవడం, నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకుని రావడం.. వంటి అంశాలపై చర్చిస్తామని క్లాజ్ ష్వాబ్ చెప్పారు.
గత ఏడాది డిసెంబర్లో షెడ్యూల్ చేసినప్పటికీ ఒమిక్రాన్ వ్యాప్తి చెందడంతో దీన్ని వాయిదా వేసింది. ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు వర్చువల్ విధానంలో నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలు దేశాధినేతలు ఇందులో పాల్గొన్నారు. చైనా అధ్యక్షుడు గ్ఝి జిన్పింగ్, జపాన్ ప్రధానమంత్రి కిషిడ ఫ్యూమియో, యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సువా వాన్డెర్ లెయెన్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడొడొ.. తొలి రోజు సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ దఫా ఇన్పర్సన్ విధానంలో ఈ సమ్మిట్ ఏర్పాటు కానున్నందు వల్ల మరోసారి వారంతా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆయా దేశాల ఆర్థికమంత్రులు, పారిశ్రామిక, వాణిజ్య వేత్తలు పాల్గొంటారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత అనేక దేశాల ఆర్థిక వ్యవస్థ తలకిందులైన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమ్మిట్ ఏర్పాటు కాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎలాంటి నిర్ణయాలు, ఒప్పందాలు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.